ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఉన్న కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం కలకలం రేపింది. ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండానే రహస్యంగా తాబేళ్లను దహనం చేశారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకూర్మం నుంచి వంద తాబేళ్లను విశాఖపట్నంలోని జూకి(Visakhapatnam Zoo )తరలించారు.ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నవాటిని అక్కడికి పంపారు. ఆలయంలో తాబేళ్ల సంరక్షణకు తగిన స్థలం లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయని చెబుతున్నారు.ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, అటవీ శాఖ, పశువైద్య శాఖ అధికారులు తాబేళ్లను పరిశీలించారు. ఈ నెల 4న పార్కులో ఆరోగ్యంగా లేని వంద తాబేళ్లను గుర్తించారు.వాటికి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం జూలోని యానిమల్ రెస్క్యూ సెంటర్(Animal Rescue Center)కు తరలించారు. అక్కడ వాటికి వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా తాబేళ్లకు నోటి నుంచి నురగ వస్తుండటంతో అవి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పార్కులో ఉన్న 211 తాబేళ్లను ఆలయ అధికారులు రోజూ పర్యవేక్షిస్తున్నారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

సంరక్షణ
ఆరోగ్యం బాగోలేని వంద తాబేళ్లను విశాఖపట్నంలోని జూ పార్కుకు తరలించామని పశువైద్య శాఖ అధికారులు తెలిపారు. అక్కడ యానిమల్ రెస్క్యూ సెంటర్లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. శ్రీకూర్మంలో తాబేళ్ల సంరక్షణకు విశాలమైన స్థలం అవసరమని దీని కోసం ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అటవీ శాఖ, పశువైద్య శాఖ అధికారులు పరిశీలించి వంద తాబేళ్లను జూ పార్కుకు తరలించామని ప్రస్తుతం ఇక్కడ ఉన్న 212 తాబేళ్లను సంరక్షిస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు.శ్రీకూర్మంలో పదేళ్ల క్రితం తాబేళ్ల పార్కును ఏర్పాటు చేశారు.అప్పట్లో తక్కువ సంఖ్యలో తాబేళ్లు ఉండటంతో చిన్న పార్కు సరిపోయింది. కానీ ఇప్పుడు తాబేళ్ల సంఖ్య పెరగడంతో స్థలం సరిపోవడం లేదు. విశాలమైన స్థలం లేకపోవడంతో తాబేళ్లు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయి. పెద్ద స్థలంలో తాబేళ్ల పార్కు(Turtle Park)ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: Anantapuram: అనంతపురం మాజీ ఎంపీ ఇకలేరు