हिन्दी | Epaper

TG High Court: పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

Anusha
TG High Court: పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు మరోసారి సివిల్ వివాదాల్లో పోలీసుల అనవసర జోక్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ సమస్యల్లో పోలీసుల జోక్యం పూర్తిగా చట్ట విరుద్ధమని, ఇదొక దురాచారంగా మారిందని పేర్కొంటూ, గతంలో ఎన్నిసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవడం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లలో 30 పిటిషన్లు దాఖలవుతుంటే వాటిలో 25 సివిల్​ వివాదాల్లో ఎక్కువ భాగం పోలీసుల జోక్యానికి సంబంధించినవేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్ బార్కాస్‌కు చెందిన మొహిసిన్ బఫానా (Mohsin Bafana) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టి. వినోద్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. బార్కాస్‌లోని 256 గజాల ఇంటి స్థలానికి సంబంధించి సివిల్ కోర్టులో ఉన్న దావాను ఉపసంహరించుకోవాలని పోలీసులు తమను బెదిరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సివిల్ కోర్టుల్లో ఉన్న వివాదాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? శాంతితి భద్రతలకంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఎందుకు? హైకోర్టులో ఉన్న పిటిషన్‌ను వెనక్కి తీసుకోమని చెప్పడానికి మీరెవరు? ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా ? ఎండలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లో (police station) కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, స్టేషనరీ కూడా ఫిర్యాదుదారుడే తెచ్చుకోవాలని చెప్తున్నారు? అన్ని పనులను మీరే చేస్తే మంచిది. కోర్టులపై భారం కూడా ఉండదు.’ అని పోలీసులపై హైకోర్టు మండిపడింది.ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొహిసిన్ సోదరుడు సలాం బిన్ సయీద్ బఫానా ఒత్తిడితో పోలీసులు తమ క్లయింట్‌ను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

TG High Court: పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
TG High Court

సివిల్ వివాదానికి

హోంశాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ దాడి జరిగినట్లు తమకు ఫిర్యాదు అందడంతోనే కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోరని, కేవలం నమోదైన ఫిర్యాదుపైనే చట్టప్రకారం దర్యాప్తు చేస్తారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సివిల్ వివాదానికి సంబంధించిన ఫిర్యాదు వస్తే సివిల్ కోర్టు (Civil Court) ను ఆశ్రయించాలంటూ సలహా ఇచ్చి పంపాలని పోలీసులకు సూచించారు. చివరగా పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ పోలీసులు దాడికి సంబంధించిన క్రిమినల్ కేసుపైనే దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Telangana: ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870