విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. ‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు.ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. విద్య, వైద్యం, రాజకీయాలు, స్పోర్ట్స్ సహా ప్రతీ రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు.అదే స్ఫూర్తితో రవాణా రంగంలోనూ మహిళలు తమ సత్తాను చాటుకుంటున్నారు.ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’ అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ మారుమూల తండాలో పుట్టి, పెరిగిన గిరిజన బిడ్డ ప్రగతి రథం స్టీరింగ్ చేతపట్టి చరిత్ర సృష్టించింది.తాజాగా తెలంగాణ ఆర్టీసీలో (TGSRTC) తొలి మహిళా బస్ డ్రైవర్గా సరిత అనే మహిళ విధుల్లో చేరి రికార్డు సృష్టించింది.
సరిత జీవితం
శనివారం (జూన్ 14) డ్యూటీలో చేరిన ఆమె మెుదటి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ (Miryalaguda) కు ఆర్టీసీ బస్ నడిపారు. ఇన్నిరోజులు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వర్తించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. పురుషాధిక్య రంగంగా భావించే రవాణా రంగంలో సరిత లాంటి మహిళలు అడుగుపెట్టి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడం స్త్రీ సాధికారతకు నిలువెత్తు నిదర్శనం.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన వాంకుడోతు సరిత జీవితం ఎన్నో కష్టాలు, సవాళ్లతో కూడుకున్నది. వాంకుడోతు రాంకోటి, రుక్కా దంపతులకు ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి సరిత. నలుగురు అక్కల పెళ్లి కోసం తన తండ్రి ఉన్న మూడెకరాల భూమిని అమ్మివేయడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో పదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసి తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచింది.
బస్సు డ్రైవర్గా ఎలా మారిందంటే?
వేసవి సెలవుల్లో దేవరకొండలోని అక్క ఇంటికి వెళ్లిన సరిత తన బావ వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. దురదృష్టవశాత్తు కొన్నాళ్లకే బావ అనారోగ్యంతో మరణించడంతో తల్లిదండ్రులు, తమ్ముడితో పాటు అక్క బాధ్యతను కూడా సరిత తన భుజాలపై వేసుకుంది. దేవరకొండ ప్రాంతంలో ఆటో నడపడం మొదలుపెట్టింది.ఆటో నడుపుతున్నప్పుడు ఆకతాయిల అల్లరి ఎక్కువ కావడంతో సరిత తన రూట్ ని మార్చుకుంది. జుట్టు కత్తిరించుకుని, ప్యాంటు, షర్టు ధరించి పురుషుడిలా తయారైంది. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ ప్రైవేట్గా పదో తరగతి పాసై హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. 2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా సరిత దరఖాస్తు చేసుకుంది.
సంవత్సరాల పాటు
మహిళల నుంచి వచ్చిన ఏకైక దరఖాస్తు ఆమెదే. అయితే ఆ సమయంలో అధికారులు ఆడవారిని డ్రైవర్లుగా తీసుకోలేమని ఆమె దరఖాస్తును తిరస్కరించారు. అయినా సరిత వెనకడుగు వేయలేదు. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తన కలను నిజం చేసుకోవడానికి మరింత దృఢంగా ప్రయత్నించింది.కొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాల బస్సును కూడా నడిపారు. 2014లో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (DTC)లో డ్రైవర్గా ఎంపికయ్యారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో బస్సు నడిపిన మొదటి మహిళా డ్రైవర్గా ఆమె గుర్తింపు పొందారు. ఆమె సరోజిని నగర్ డిపోలో పనిచేస్తూ రోజుకు సుమారు 135 కి.మీ బస్సు నడిపేవారు. ఢిల్లీలో ఆమె సేవలకు మంచి గుర్తింపు లభించింది.

ఖర్చులు ఎక్కువ
ఆమె అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2018లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం, కిరణ్ బేడీ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ‘ఉమెన్ అచీవర్స్’ అవార్డును అందుకున్నారు.ఢిల్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో సరిత తెలంగాణకు తిరిగి రావాలని భావించారు.ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ని కలిసి తనకు ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆయన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లతో మాట్లాడి స్పెషల్ రిక్రూట్మెంట్ కింద ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
సమానంగా
ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ (TSRTC) లో అవకాశం కల్పించింది.హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సును నడిపి ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా రికార్డు సృష్టించారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా సవాళ్లతో కూడిన రంగంలో రాణించగలరని నిరూపించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. సరిత ప్రయాణం మహిళా సాధికారతకు ఒక ఉదాహరణ. ఆమె సాహసం, సంకల్పం అనేక మందికి ఆదర్శంగా నిలిచాయి.
Read Also: Telangana Gaddar Film Awards : అట్టహాసంగా గద్దర్ అవార్డు వేడుకలు