తెలంగాణ రైతులకు గుడ్న్యూస్. ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందే తొలకరి పలకరించనుంది. ఏరువాకకు ముందే సన్నద్ధం కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ అంచనాల కంటే ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కేరళను మే 27న తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ వేగం ఆధారంగా జూన్ మొదటి వారంలో, అంటే దాదాపు 5వ తేదీలోపే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ముఖ్యంగా, రానున్న వర్షాకాలంలో తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD ఇదివరకే ప్రకటించింది. సాధారణంగా రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు సగటున 734 మి.మీ వర్షం కురవాలి. అయితే గతేడాది అనూహ్యంగా 962.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈసారి కూడా అధిక వర్షపాతం(High rainfall) అంచనాలు ఉండటంతో వ్యవసాయ రంగం, నీటి వనరుల పరంగా ఇది సానుకూల పరిణామంగా చూడవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, అధిక వర్షాల వల్ల కారణంగా వరదలు, ఇతర నష్టాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఉక్కపోత
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వాతావరణం పూర్తిగా మారనుంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు(Light rains) కురిసే ఛాన్స్ ఉందన్నారు. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ ఉక్కపోత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం (మే 12) ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, హనుమకొండ జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read Also : EPFO: పీఎఫ్ వివరాలకు ఈపీఎఫ్ఓ కొత్త సేవలు