తెలంగాణలో రాజకీయ కలకలం : కవిత కీలక నిర్ణయానికి సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సడెన్గా తీసుకుంటున్న చర్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఆమె విడుదల చేసిన ఓ బహిరంగ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ లేఖ నేపథ్యంలో ఆమె పార్టీకి అనుసంధానంగా ఉన్న రాజకీయ సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణపై అనేక ఊహాగానాలకు తావిచ్చింది.
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ (KCR party) నేతలతో అత్యవసరంగా సంప్రదింపులు నిర్వహించినట్టు సమాచారం. ప్రత్యేకించి కవితతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్, పార్టీ ఎంపీని ప్రత్యేకంగా ఆమె వద్దకు పంపించి ఆమె అభిప్రాయాలను తెలుసుకోవడం గమనార్హం. అయితే కవిత మాత్రం స్పష్టంగా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత కోరుతున్నారు. పార్టీ తనకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటన్నది బయటపడాలని ఆమె డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం చెబుతోంది.

కాంగ్రెస్ లోకి ఎంట్రీ అడ్డంకుల్లో : మధ్యవర్తుల రాయబారానికి బ్రేక్!
ఇక కాంగ్రెస్ పార్టీలోకి చేర్పు అంశంపై కూడా చర్చలు జరిగాయి. రహస్యంగా జరిగిన ఈ పరిణామాల్లో, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్లతో చర్చించినట్టు తెలుస్తోంది. రేవంత్ మాత్రం ఈ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా హైకమాండ్ ముందు వ్యక్తం చేశారు. కవితను పార్టీలోకి చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. దీనితో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తాత్కాలికంగా కవిత ఎంట్రీపై బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.
జూన్ 2న కీలక ప్రకటన? ‘తెలంగాణ జాగృతి’తో తిరిగి ప్రజల్లోకి!
కాంగ్రెస్ తో రాయబారం దాదాపు విఫలమైంది. దీంతో, కవిత (Kavitha) తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. తొలుత, గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు. ‘సింగరేణి జాగృతి’ పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. అదే విధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్తో సమావేశమవ్వడం, అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో.. కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
Read also: KCR: జూన్ 5న కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్..!