వరంగల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ జాబ్ మేళా జరిగింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో ఉత్సాహం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి తనకు తగిన ఉద్యోగం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
వేల సంఖ్యలో అభ్యర్థులు ఒకేసారి హాజరుకావడంతో ప్రాంగణం బిజీ గా మారింది. బహుళ సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులను నియంత్రించేందుకు పోలీసులు ముందుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. రద్దీ కారణంగా కొంత గందరగోళం నెలకొన్నా, అధికారులు చురుగ్గా వ్యవహరించి జాబ్ మేళా సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి అభ్యర్థికి సముచిత సమాచారం అందించేలా కౌంటర్లను ఏర్పాటు చేశారు.

100 కంపెనీలు – 8వేలకుపైగా ఉద్యోగాలు
ఈ జాబ్ మేళాలో రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పేరుపొందిన దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, రీటైల్, బ్యాంకింగ్ వంటి విభాగాల్లో 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలు ఎదుర్కొనడానికి అవకాశం లభించడంతో ఎంతో మంది తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబ్ మేళా ఎంతో మందికి మంచి అవకాశాల వేదికగా నిలిచింది.