సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న దురాశతో ఓ యువకుడు చేసిన పని అందరిని కలిచివేసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి యువతలో ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటోంది. సోషల్ మీడియాలో తక్కువ టైంలోనే ఫేమస్ కావాలనే తపనతో కొందరు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఒక యువకుడు రైలు పట్టాలపై అత్యంత ప్రమాదకరమైన విన్యాసం చేస్తూ రీల్ చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ ఈ షాకింగ్ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. వీడియోలో ఒక యువకుడు వేగంగా దూసుకొస్తున్న రైలు పట్టాల మధ్య నిలువుగా పడుకుని ఉన్నాడు. ట్రైన్ వస్తున్నా అతడు మాత్రం పిచ్చిగా నవ్వుతూ అలాగే ఉన్నాడు. ట్రైన్ దగ్గరుకు రాగానే పట్టాలపై పడుకున్నాడు. రైలు అతనిపై నుంచి వెళ్లిపోయిన వెంటనే అతను లేచి నిలబడి ఏదో గొప్ప విజయం సాధించినట్లుగా సంకేతం చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.యువకుడు చేసిన పనిపై తీవ్రంగా స్పందించిన వీసీ సజ్జనార్(VC Sajjanar) ట్వీట్ చేస్తూ, “ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా? ఏదో ఘనకార్యం సాధించినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు? ఇలాంటివి మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి” అని హెచ్చరించారు.
తప్పుదోవ
నెటిజన్లు కూడా ఈ యువకుడి చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని, ఇలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని రైల్వే శాఖ ,ఆర్పీఎఫ్ సిబ్బందిని ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తున్నారు. ‘ఇలాంటి వాళ్లను మీరు తప్పనిసరిగా అరెస్టు చేయాలి, లేకపోతే వీడిని చూసి ఇంకో పది మంది ఇలా చేస్తారు’ అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.కాగా, ఈ వీడియో పశ్చిమ బెంగాల్లో తీసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన రీల్స్ యువతను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని,సోషల్ మీడియా(Social media)లో లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు ఇలాంటి ఘటనలపై నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Read Also : EAPCET: తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల