సైబర్ నేరాల బెడదను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ సేవల్లోని ‘కలెక్ట్ రిక్వెస్ట్’ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా యూపీఐ ద్వారా నగదు పంపించడానికి మాత్రమే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, సైబర్ నేరగాళ్లు ఈ ఫీచర్ను అడ్డంగా ఉపయోగించుకుంటున్నారు. బాధితులకు డబ్బు పంపిస్తున్నామని నమ్మించి, కలెక్ట్ రిక్వెస్ట్ ద్వారా పిన్ ఎంటర్ చేయించి, వారి ఖాతాల నుంచి డబ్బును దోచుకుంటున్నారు. ఈ నేరాలను నియంత్రించడంలో భాగంగా NPCI ఈ నిర్ణయం తీసుకుంది.
స్నేహితులు, బంధువులకు రిక్వెస్ట్ కుదరదు
ఈ తాజా నిర్ణయం వల్ల గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా స్నేహితులు లేదా బంధువుల నుంచి డబ్బు పంపమని కోరే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ సేవలు ఇకపై అందుబాటులో ఉండవు. ఈ సేవలు నిలిపివేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసగించే అవకాశాలు తగ్గుతాయని NPCI భావిస్తోంది. ఇప్పటివరకు తమకు రావాల్సిన డబ్బు కోసం ఈ ఫీచర్ను ఉపయోగించుకున్న వినియోగదారులు ఇకపై ఆ సేవను వాడుకోలేరు. డబ్బు పంపించడానికి మాత్రం పాత పద్ధతిలోనే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
భద్రత కోసం కీలక నిర్ణయం
ఈ నిర్ణయం వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు NPCI పేర్కొంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో మోసాలను తగ్గించి, వినియోగదారులకు మరింత భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు నిలిపివేయడం వల్ల యూపీఐ లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. అయితే, దీనివల్ల వినియోగదారులు డబ్బు కోసం వేరే మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల గురించి యూపీఐ యాప్స్ కూడా తమ వినియోగదారులకు త్వరలో సమాచారం ఇవ్వనున్నాయి.
Read Also : IMD Alert: పలు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు: ఐఎండీ అలర్ట్