మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణించింది.
హాస్పిటల్ నిర్లక్ష్యం
బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖేకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న సుశాంత్ భార్య తనిషా ఏడు నెలల గర్భిణి. గర్భంలో కవలున్న ఆమె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడింది. దీంతో పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్కు ఆమెను తరలించారు.తనిషాకు చికిత్స అందించేందుకు పది లక్షలను హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లిస్తేనే చికిత్స ప్రారంభిస్తామని చెప్పారు. ముందుగా రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఆమె భర్త సుశాంత్ చెప్పినప్పటికీ చికిత్సకు నిరాకరించారు. ఒకేసారి పది లక్షలు చెల్లించలేక తనిషాను మరో హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్సలో జాప్యం వల్ల డెలివరీ కాంప్లికేషన్స్తో ఆమె మరణించింది.
ఎమ్మెల్సీ స్పందన
భార్య తనిషా మరణానికి దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ నిర్లక్ష్యం కారణమని ఆమె భర్త సుశాంత్ ఆరోపించాడు. ‘వారు జీవితం కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. సకాలంలో చేర్చుకున్నట్లయితే ఆమె బతికి ఉండేది’ అని వాపోయాడు. ఆ హాస్పిటల్ నిర్లక్ష్యంపై ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు కోసం మెడికల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖే ఈ సంఘటనపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు.అంతర్గతంగా విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు అన్ని వివరాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకన్కర్, పూణే మునిసిపల్ కమిషనర్ను ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.డబ్బు కోసమే ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సమాజంలో ఆసుపత్రులు ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రాధాన్యత ఇవ్వాలని, డబ్బును ప్రాధాన్యతగా చూడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.