Nishant Kumar : ఈ ఏడాది చివర్లొ జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో విపక్షాల వాదనలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎన్డీయే తరఫున తన తండ్రే సీఎం అభ్యర్థి అని, నితీష్ నాయకత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పాట్నాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమిలో నితీష్ కుమార్ నాయకత్వాన్ని కేంద్ర మంత్రి అమిత్షా, బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కూడా ధ్రువీకరించారని చెప్పారు.

”ఆయన సీఎం ఎందుకు కాకూడదు?
ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను తప్పిస్తారంటూ విపక్షాలు చేస్తు్న్న ఆరోపణలపై నిషాంత్ స్పందిస్తూ.. ”ఆయన సీఎం ఎందుకు కాకూడదు?. అమిత్షా చెప్పారు, సామ్రాట్ చెప్పారు, దానిపై ఎలాంటి సందేహం లేదు” అని అన్నారు. నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్నెస్తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు. 2010లో తన తండ్రికి ఇచ్చిన తీర్పుకంటే పెద్ద తీర్పును ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల తీర్పుపై తనకు నమ్మకం ఉంది
రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై నిషాంత్ను అడిగినప్పుడు ఆయన నవ్వుతూ సమాధానం దాటవేశారు. నితీష్ మళ్లీ సీఎం అవుతారని, ప్రజల తీర్పుపై తనకు నమ్మకం ఉందని, బీహార్ ప్రజలు చాలా తెలివైన వాళ్లని, వారికి అన్నీ తెలుసునని అన్నారు. 2010 కంటే పెద్ద తీర్పును 2025 ఎన్నికల్లో ఎన్డీయేకు ఇవ్వాలని ప్రజలను మరోసారి కోరారు.
Read Also: ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం : ఐఎండీ