అమెరికా అనేక దేశాలపై విధించిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోపక్క చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. అమెరికా వాణిజ్య భాగస్వాములైన 60 దేశాలపై సుంకాలు విధించిన కొన్ని గంటల తరువాత ట్రంప్ పాలసీలో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. సుంకాలపై సంప్రదింపులు కొనసాగుతున్నందున వాటిని మార్చడానికి బదులుగా వాణిజ్య భాగస్వాములందరిపైనా ఏకరీతిలో 10 శాతం టారిఫ్ రేటును నిర్ణయించారు. మరోపక్క చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన సుంకాలను అమెరికా 125 శాతానికి పెంచింది. అమెరికన్ వస్తువులపై చైనా విధించిన 84 శాతం సుంకానికి ప్రతిగా బీజింగ్ చర్యలు ప్రపంచ మార్కెట్లను గౌరవించడం లేదని ఆరోపిస్తూ అమెరికా ఈ చర్య తీసుకుంది. అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులన్నింటిపైనా ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత ఇది అమల్లోకి వచ్చింది. సుంకాల విధింపు అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభానికి కారణమైంది.
సుంకాల విధానం
ఈ విధానం అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వాణిజ్య పరంగా అమెరికాను చాలా దారుణంగా చూశాయని డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా సుంకాల విధానంపై డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక బెదిరింపులను చూపిస్తున్నారని చైనా పేర్కొంది. అంతర్జాతీయ నియమాల కంటే అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వడం ఏకపక్షవాదం ఇంకా ఆర్థిక బెదిరింపులు లాంటిదని చైనా చెబుతోంది. అమెరికా సుంకాల విధానం ప్రపంచ ఉత్పత్తి, సప్లయ్ చైన్ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని చైనా ఆరోపిస్తోంది.
చైనా విజ్ఞప్తి
అంతకుముందు అమెరికా చైనాపై 104 శాతం సుంకాన్ని ప్రకటించింది, ఆ తరువాత చైనా అమెరికాపై అదనంగా 50 శాతం సుంకం విధించింది. అంటే గతంలో ఉన్న 34 శాతానికి బదులుగా మొత్తం 84 శాతం సుంకాన్ని అమెరికాపై విధించింది. అమెరికా టారిఫ్ కు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని చైనా విజ్ఞప్తి చేసింది. అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి చైనా తన పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు.

చైనాతో భారత్ కు ఎప్పుడూ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్థాన్ కు అండగా ఉంటూ భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను చైనా చేస్తుంటుంది. సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తతలను పెంచి పోషిస్తుంటుంది. అయితే, ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో చైనా తన స్టాండ్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.బీజింగ్ లో జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్ పింగ్ మాట్లాడుతూ భారత్ తో అభిప్రాయ భేదాలను తగ్గించుకుని, సరఫరా వ్యవస్థలను పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పారు. జిన్ పింగ్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read Also: US: హౌస్ న్యాయమూర్తుల ఇంజక్షన్ అధికారాన్ని పరిమితం చేసే బిల్లుకు ఆమోదం