జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే ఉగ్రసంస్థ బాధ్యత వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో దాదాపు 30 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన పాక్ ప్రేరేపిత సంస్థల కుట్రగా భావిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ
TRF 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ. ఇది పాకిస్తాన్లో ఉన్న లష్కర్-ఎ-తోయిబాకు అనుబంధంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు షేక్ సాజిద్ కమాండర్గా, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్గా ఉన్నారు. యువతను భద్రతా బలగాలపై దాడులకు ప్రేరేపించడం, టార్గెట్ కిల్లింగ్స్ చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి కార్యకలాపాల్లో ఈ సంస్థ నిమగ్నమై ఉంది.
పాక్ మద్దతుతో ఇంకా పాక్షికంగా కార్యకలాపాలు
భారత ప్రభుత్వం 2023లో TRFను ఉగ్రసంస్థగా ప్రకటించి నిషేధించింది. కానీ పాక్ మద్దతుతో ఇంకా పాక్షికంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, భారత్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉంది. తాజా దాడి ద్వారా మళ్లీ ఈ సంస్థ భారత్లో తన ఉనికిని చాటాలన్న ప్రయత్నం చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భద్రతా యంత్రాంగం ఈ దాడికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు సుదీర్ఘంగా గాలింపు చర్యలు చేపట్టింది.