భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు.ఈ పరిణామాల మధ్య షోపియాన్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రత బలగాలు- ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ సంభవించింది. జిల్లాలోని షుక్రూ ప్రాంతంలో ఈ ఉదయం ఈ ఎదురుకాల్పులు ఆరంభం అయ్యాయి. నాలుగు గంటల పాటు కొనసాగాయి. తుపాకుల శబ్దంతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది.షుక్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేసినట్లు పక్కా సమాచారం అందడంతో భద్రత బలగాలు, పారా మిలటరీ(Para military) సిబ్బంది, జమ్మూ కాశ్మీర్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచీ గాలింపు చర్యలు కొనసాగాయి. దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టింది భారత ఆర్మీ. కార్డన్ అండ్ సెర్చ్ కొనసాగుతున్న సమయంలో సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీనితో భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ భారీ సంఖ్యలో భద్రత బలగాలు, పోలీసులను అక్కడికి తరలించారు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. తొలుత ఈ ఎన్కౌంటర్(Encounter)కుల్గాంలో ఆరంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత క్రమంగా షోపియన్ జిల్లా కెల్లర్ అటవీ ప్రాంతానికి విస్తరించినట్లు చెప్పారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులు దాదాపు నాలుగు గంటలుగా ఉగ్రవాదులతో పోరాడినట్లు వివరించారు.

ఈ ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరికి భారత్లో తీవ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. లష్కరే తొయిబా చీఫ్ ఆపరేషనల్ కమాండర్ షాహిద్ కుట్టాయ్(Shahid Kuttai), అద్నాన్ షఫీ దార్ మృతి చెందినట్లు ఓ ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. షోపియన్ జిల్లాలోని ఛోటిపొరా- హీర్పొరాకు చెందిన షాహిద్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడు. 2023 మార్చి 28వ తేదీన ఉగ్రవాద సంస్థలో చేరాడు. పలు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో అతనికి ప్రమేయం ఉంది. 2024 ఏప్రిల్ 8వ తేదీన డానిష్ రిసార్ట్(Danish Resort)లో జరిగిన కాల్పుల ఘటనలో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు జర్మన్ పర్యాటకులు, స్థానిక డ్రైవర్ గాయపడ్డారు. కుల్గామ్ బీర్బాగ్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ హత్యోదంతంతోనూ అతనికి సంబంధాలు ఉన్నట్లు జిల్లా పోలీసులు వివరించారు. మరో ఉగ్రవాదిని మెల్హోరా వందూనా గ్రామానికి చెందిన అద్నాన్ షఫీ దార్గా గుర్తించారు. మూడో ఉగ్రవాదాని ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.
Read Also : Trade: అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ