గిగ్ కార్మికుల హక్కుల కోసం రాహుల్ గాంధీ గళమెత్తారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా వేలాది గిగ్ కార్మికులతో మాట్లాడిన అనుభవాలను గుర్తుచేస్తూ, వారి ఆవేదనలపై స్పందించారు. “మాకు రేటింగ్ కాదు, హక్కులు కావాలి. మేము మనుషులమే కానీ బానిసలం కాదు” అని ఓ డెలివరీ కార్మికుడు తనతో చెప్పిన మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు గిగ్ వర్కర్ల నిరంతర పోరాటానికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
చరిత్రాత్మక ముందడుగు – కర్ణాటక ఆర్డినెన్స్
ఈ నేపథ్యంలో, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల (Gig workers) హక్కులు, గౌరవం, భద్రతకు హామీ ఇస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ (Ordinance issued) చేయడం చారిత్రాత్మక ముందడుగు అని రాహుల్ ప్రశంసించారు. ఎండ, వాన, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని గిగ్ కార్మికులు మనకు ఆహారం, నిత్యావసర వస్తువులు చేరవేస్తారని ఆయన అన్నారు. అయినప్పటికీ, వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎలాంటి వివరణ లేకుండా యాప్ల నుంచి వారిని బ్లాక్ చేయడం, అనారోగ్యానికి గురైతే సెలవులు కూడా మంజూరు కాకపోవడం, వారికి చెల్లించే మొత్తాలు పారదర్శకత లేని అల్గోరిథమ్ల ద్వారా నిర్ణయించబడటం వంటివి గిగ్ వర్కర్ల ప్రధాన సమస్యలని ఆయన వివరించారు.

కొత్త విధానాలతో కొత్త భరోసా
కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, వారి ఒప్పందాలపై న్యాయమైన ప్రమాణాలు ఉండటం, చెల్లింపుల విషయంలో అల్గోరిథమిక్ పారదర్శకత ఉండటం, ఏకపక్షంగా యాప్ల నుంచి తొలగించకుండా రక్షణ కల్పించటమే లక్ష్యంగా తీసుకొచ్చినందుకు ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ విధానం గిగ్ కార్మికుల జీవితాల్లో స్థిరత్వం తీసుకొచ్చే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
టెక్నాలజీ మానవ సేవకే ఉండాలి
టెక్నాలజీ అనేది ప్రజలకు సేవ చేసేదిగా ఉండాలని, ఈ విషయంలో రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలిచాయని రాహుల్ అన్నారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనిస్తుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత పనులు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, అవి పని సంబంధాలను పునర్నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల హక్కులే కేంద్రంగా ఈ వ్యవస్థలు ఉండాలని, ఈ విధానాన్ని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
పనిలో మార్పు, హక్కుల్లో పునర్నిర్మాణం
గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత పని విధానాలు భారతదేశంలో కొత్త అవకాశాలను తెచ్చినప్పటికీ, అవి సంప్రదాయ పనితీరులను భిన్నంగా మార్చేశాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మార్పుల్లో కార్మికుల హక్కులు అణచివేయబడకూడదని, ప్రతీ రాష్ట్రంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి నిర్ధిష్ట విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల శ్రమకు గౌరవం కల్పించే దేశంగా భారతదేశం ఎదగాలంటే ఇలాంటి చట్టపరమైన భరోసాలు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా