జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై మే 7 తెల్లవారుజామున మెరుపుదాడి చేసింది. దీనిని జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్ మే 8, 9 తేదీల్లో భారత గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. అయితే, పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఉపరితలం నుంచి గగనతలంలోనే కూల్చేసే ఆకాశ్ మిసైల్ తో భారత్ అడ్డుకుంది. పాక్ దాడులకు ఇది రక్షణ రేఖగా నిలిచింది.ఆకాశ్ విజయవంతంగా పాకిస్థాన్ క్షిపణులను తిప్పికొట్టడంపై ఆ వ్యవస్థ రూపకర్త డాక్టర్ ప్రహ్లాద రామారావు(Dr. Prahlada Rama Rao)మాట్లాడుతూ,‘ఇది నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన రోజు’ అని వ్యాఖ్యానించారు. ఆకాశ్ క్షిపణి శత్రు విమానాలు, క్షిపణులను గుర్తించి ఖచ్చితంగా ధ్వంసం చేయడం ద్వారా అత్యంత ప్రశంసలు అందుకుంది. ఈ వ్వవస్థ విజయానికి కేంద్రబిందువుగా నిలిచిన డాక్టర్ రామారావు, కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్త. ఆయన భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (DRDO)లో చేసిన విశేష సేవలు భారత క్షిపణి సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.నేను అభివృద్ధి చేసిన ఆకాశ్ మిసైల్, శత్రుదేశ బెదిరింపులను అద్భుతంగా ఎదుర్కొన్న దృశ్యం నా జీవిత సాక్షాత్కారంలా అనిపించింది’ అని అన్నారు. ఈ వ్యవస్థ మా డిజైన్ అంచనాలను మించిపోయిందని కూడా పేర్కొన్నారు.
అభివృద్ధి
భారత క్షిపణి అభివృద్ధికి పునాది పడిన దశల నుంచే ఆకాశ్ ప్రాజెక్టుతో డాక్టర్ రామారావు పని చేస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి, ‘మిసైల్ మాన్’ డాక్టర్ ఏపీ జె అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) స్వయంగా రామారావును ఎంపిక చేశారు. ఆకాశ్ ప్రాజెక్ట్కు అతి చిన్న వయస్సులో ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించారు. ఆ సమయంలో భారత సైన్యం ఈ వ్యవస్థపై నమ్మకంగా లేనప్పటికీ, రామారావు కృషితో ఆకాశ్ విజయవంతంగా అభివృద్ధి చెందింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థలో ఆకాశ్ ముఖ్యమైనది. బారత్ డైనమిక్స్ లిమిటెడ్, DRDO సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిసైల్ వ్యవస్థలో అనేక మార్పులు, సంస్కరణ జరిగాయి. ఆకాశ్-NG (నెక్స్ట్ జనరేషన్) వర్షన్ 80 కిలోమీటర్ల పరిధి,గంటకు 2,500 కిలోమీటర్ల వేగం. ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి, 12 మిసైళ్లను ప్రయోగించగల సామర్థ్యం దీని సొంతం.

శక్తివంతమైన
ఆకాశ్ మాత్రమే కాదు డాక్టర్ రామారావు దాదాపు 10కిపైగా మిసైల్ వ్యవస్థల అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. వీటిలో గగనతలలో విమానాలపై దాడి చేయగల అస్త్ర (Astra), రష్యాతో కలసి అభివృద్ధి చేసిన, అత్యంత శక్తివంతమైన ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్ బ్రహ్మోస్ వంటివి ఉన్నాయి. ఈయన సుదీర్ఘ కృషి రక్షణ రంగంలో ఆత్మనిర్బర్ భారత్కు అత్యంత విలువైన బలాన్ని ఇచ్చింది. ఇక, పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై భారత్ బ్రహ్మోస్(BrahMos) క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే.ఈరోజు త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్)ఈ వ్యవస్థలను విరివిగా వినియోగిస్తున్నాయి. ఈ వ్యవస్థల పనితీరు అంతర్జాతీయంగా ఆసక్తిని పెంచింది.
Read Also : Schools Reopen: విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం!