పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని నివాసంలో దాదాపు 30 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు సహా ఆయా అంశాలపై ఇద్దరు నేతలు ఈ భేటీలో చర్చించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఒమర్ అబ్దుల్లా ఇంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు, కానీ దాడి తర్వాత ఆయన ప్రధానమంత్రిని కలవడం ఇదే మొదటిసారి.ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్న ప్రధాని మోడీతో ఒమర్ అబ్ధుల్లా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకాశ్మీర్కు సంబంధించిన కీలక అంశాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటీవలి ఉగ్రదాడి అనంతరం పరిణామాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరిగాయని ప్రధానికి సీఎం చెప్పారు. గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా, సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను రక్షించేందుకు యత్నించి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
సమావేశం
జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని సురక్షితంగా మార్చడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాలపై ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సమావేశం గురించిన సమాచారం మాత్రమే అధికారికంగా ఇవ్వడం జరిగింది.తమ రాష్ట్రానికి వచ్చిన అతిథులను కాపాడటంలో తానూ విఫలమయ్యానని సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 26 మంది ప్రాణాలు కోల్పోయిన వేళ.. రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తామన్నారు.కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీసిన విషయం విధితమే. ఉగ్రదాడులు అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను తీవ్రతరం చేశాయి. సరిహద్దు ప్రాంతాలతోపాు జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు.

అనుకూలంగా
పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులకు సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 15నే పహల్గాం చేరుకున్న ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారు. బైసరన్ వ్యాలీ ప్రాంతం తమకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడే పర్యాటకులపై దాడులకు పాల్పడ్డారని విచారణలో భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఉగ్రవాదులకు స్థానికులు కొంతమంది సహకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. తాజాగా, ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసి భారీ షాకిచ్చింది.
Read Also: IMF Board: కేంద్రం కీలక నిర్ణయం..ఐఎంఎఫ్ బోర్డు సభ్యుడి తొలగింపు