వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “బట్టలూడదీసి కొడతాం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ తీసేస్తాం” అంటూ ఇచ్చిన హెచ్చరికలు పోలీసు యంత్రాంగాన్ని కలవరపరిచాయి.

లావు శ్రీకృష్ణదేవరాయల వ్యూహాత్మక విమర్శలు
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే వైఎస్ జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో లోక్ సభలో కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లిన లావు, తాజాగా జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను కూడా పంపారు. జగన్ బెయిల్ మీద బయట ఉన్నవారిగా వ్యవస్థలను బెదిరించేలా మాట్లాడటం, పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం అత్యంత హానికరం అని లావు లేఖలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా అభివర్ణించారు. జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లేలా, ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రానికి లేఖ?
లావు లేఖ వెనక ఉన్న అసలు ఉద్దేశం వేరే దిశగా చూస్తే ఇది కేవలం వ్యాఖ్యలపై స్పందన కాదనీ, జగన్కు న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించేందుకు ముందడుగేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న నేపధ్యంలో, ఆయన వ్యాఖ్యలు బెయిల్ షరతులకు విరుద్ధంగా ఉన్నాయని చూపించడమే లక్ష్యంగా ఉందని అంటున్నారు. దీనివల్ల జగన్పై న్యాయపరమైన చర్యలకు దారి తీయవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. జగన్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించింది. “ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటాయి. రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరించాలి” అని వారు అధికారికంగా ప్రకటించారు. పోలీసుల పట్ల అసభ్యంగా మాట్లాడటం, బెదిరింపులకు పాల్పడటం శ్రేయస్సు కాదని స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యల ద్వారా మొదలైన ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో పెరుగుతున్న వైషమ్యాన్ని, పోలీసు వ్యవస్థపై ప్రభావాన్ని, కేంద్ర-రాష్ట్ర సంబంధాల దిశలను స్పష్టంగా చూపిస్తున్నది. జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. లావు లేఖతో ఈ వివాదం కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో, మున్ముందు మరింత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. జగన్ రాజకీయ భవితవ్యం, వైసీపీ ఎన్నికల వ్యూహం, మరియు టీడీపీ దూకుడు — ఇవన్నీ కలిసి ఏపీ రాజకీయాలను శాశ్వతంగా మార్చేలా ఉన్నాయి.
Read also: Ration shops : ఏపీలో రేషన్లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ రేషన్ షాపులు