కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఘోర విషాదం
కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలంలో ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమతో నిండి ఉన్న జీవితాన్ని కలలు కంటూ ముందుకు సాగుతున్న ఓ దంపతుల జీవితం ఒక్కసారిగా బైక్ ప్రమాదంతో ఒక్కసారిగా ఛిన్నాభిన్నమై శోకసంద్రంలో మునిగిపోయింది. గర్భిణిగా ఉన్న భార్య రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఆమె మృతిని తట్టుకోలేని భర్త మానసిక వేదనతో యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటనతో రెండు కుటుంబాల్లో కన్నీటి వాతావరణం నెలకొంది.
సీమంతం చేసిన పది రోజులకే విషాదం
ఏడాది క్రితం బిచ్కుందకు చెందిన మంగలి సునీల్ (30)కు మద్నూర్ మండలం పెద్దతడ్గూర్కు చెందిన జ్యోతి (27)తో వివాహమైంది. ఆమె 5 నెలల గర్భిణి కావడంతో ఈ నెల 14న బిచ్కుందలో సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత జ్యోతిని ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చారు.
సునీల్ శుక్రవారం ఉదయం భార్యను తిరిగి బిచ్కుందకు తీసుకురావడానికి అత్తవారి ఇంటికి బయలుదేరాడు. భార్యాభర్తలు బైక్పై వెళ్తుండగా బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద జ్యోతి ప్రమాదవశాత్తు వాహనంపై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె తల భాగానికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్ ద్వారా బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో మార్గంమధ్యలోనే ఆమె కన్నుమూశారు.
భార్య మృతి బాధ తట్టుకోలేక భర్త ఆత్మహత్య
జ్యోతి మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురాగా అక్కడ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటివరకు తనతో కబుర్లు చెప్పిన భార్య విగతజీవిగా మారడంతో సునీల్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగారు. బయటకు వచ్చి వాంతులు చేసుకోవడంతో అతడిని చికిత్స కోసం వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. భార్యాభర్తల మృతితో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
ఇద్దరు కాపురశ్రీలు అకాల మరణంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఇటీవలే సంతోషంగా జరుపుకున్న సీమంతం వేడుకలు ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపగా, ఇప్పుడు అదే కుటుంబం అంతులేని కన్నీటి తడిలో మునిగిపోయింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానికులు ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకేరోజులో భార్యాభర్తలు ఇద్దరూ మరణించడం చాలా దురదృష్టకరం అని పలువురు అంటున్నారు.
ప్రేమతో సాగిన ఓ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. వారి కలలు, ఆశలు, భవిష్యత్తుపై ఉన్న స్వప్నాలు అంతా ఒక్కసారిగా చీకట్లో మునిగిపోయాయి. ఈ ఘటన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, సమాజాన్నే కలిచివేసింది. జీవితం ఎంత అస్థిరమై ఉంటుందో ఈ సంఘటన మళ్ళీ ఒక్కసారి రుజువు చేసింది.
Read also: ED : తెలంగాణలో ‘ఈడీ’ రాజకీయం!