అణ్వాయుధాలు ఉపయోగించకుండానే ఉక్రెయిన్(Ukraine)తో యుద్ధాన్ని పూర్తి చేసి, అనుకున్న లక్ష్యాలను సాధించే సత్తా రష్యా(Russia)కు ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుతిన్ (Putin)ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల దాడికి దిగింది.
హక్కులకు రక్షణ కల్పించడమే రష్యా ఉద్దేశం
అణ్వాయుధాలను వినియోగించే తప్పును బలవంతంగా మాతో చేయించాలని చాలా ప్రయత్నాలు జరిగాయని పుతిన్ పేర్కొన్నారు. కానీ, వాటిని వాడకుండానే మా లక్ష్యాలను సాధించే శక్తి తమకు ఉందని చెప్పారు. యుద్ధానికి కారణమైన అంశాలకు పూర్తిగా ముగింపు పలకడం, శాశ్వత శాంతి కోసం పరిస్థితులను సృష్టించడం, దేశ భద్రతకు హామీ వంటివి తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో రష్యన్ మాట్లాడే ప్రజల దీర్ఘకాలిక శాంతి, వారి హక్కులకు రక్షణ కల్పించడమే రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అన్నారు.

273 డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి
అంతకుముందు ఉక్రెయిన్పై వందలాది డ్రోన్లతో రష్యా మరోసారి విరుచుకుపడింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలయ్యాక సంఖ్యాపరంగా మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని ఉక్రెయిన్ వర్గాల సమాచారం. యుద్ధం ముగింపు విషయంలో ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ భారీ దాడులు జరగడం గమనార్హం. కీవ్ సహా ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా రష్యా 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానికదళం తెలిపింది.
Read Also: Hinduja Group: యూకే కుబేరుల జాబితాలో హిందుజా గ్రూప్