భారత్, పాకిస్థాన్ (India, Pakistan) మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై కొందరి నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే (Manoj Mukund Naravane) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంత రొమాంటిక్గా ఉండదని, ఇదేమీ బాలీవుడ్ (Bollywood) సినిమా కాదని, చాలా తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు.

దౌత్యానికి మొదటి ప్రాధాన్యం
ఎప్పుడైనా దౌత్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు. షెల్లింగ్ను చూడగానే చిన్న పిల్లలు కూడా రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకే పరుగెత్తవలసి ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారిని కోల్పోతే ఆ ఆవేదన తరతరాలను వెంటాడుతుందని అన్నారు.
బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి
యుద్ధం అనేది ఎప్పుడూ చివరి అవకాశంగా మాత్రమే ఉండాలని అన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారని అన్నారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా దానిని నివారించేందుకు మనం మొగ్గు చూపాలని అన్నారు. చాలామంది యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారని, కానీ తాను ఓ సైనికుడిగా యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమే అయినప్పటికీ దౌత్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చర్చలతో సమస్య పరిష్కారం కావాలని భావిస్తానని అన్నారు.
Read Also: ISRO: 10 శాటిలైట్లు నిరంతరం పహారా కాస్తున్నాయి: ఇస్రో చైర్మన్