ఉక్రెయిన్పై కొనసాగుతున్న యుద్ధం మధ్య తాత్కాలిక విరామానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. తీవ్ర శీతల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీవ్ సహా ఇతర నగరాలపై ఒక వారం రోజుల పాటు దాడులు చేయవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు. తన అభ్యర్థనకు పుతిన్ అంగీకరించారని వైట్హౌస్లో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని క్రెమ్లిన్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. “అసాధారణ చలికాలంలో కీవ్, ఇతర పట్టణాలపై కాల్పులు ఆపాలని పుతిన్ను నేను కోరాను. ఆయన అంగీకరించారు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కాల్ వల్ల ఫలితం ఉండదని చాలామంది చెప్పినా, ఆశ్చర్యకరంగా పుతిన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో పౌరులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: TTD: భక్తులకు అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత

తీవ్రంగా విద్యుత్ కొరత, తాగునీటి ఇబ్బందులు
ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రష్యా విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో ఇప్పటికే విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. హీటింగ్, తాగునీటి సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఉక్రెయిన్ అధికారులు “వింటర్ను ఆయుధంగా వాడటం”గా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ, “విద్యుత్ సరఫరా జీవనాధారం. దాడులు ఆగితే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, యుద్ధం ముగింపునకు దారితీసేలా శాంతి చర్చల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇటీవల అబుదాబిలో అమెరికా–రష్యా– ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఇప్పుడు మాస్కోలో చర్చలు జరపాలని రష్యా ఉక్రెయిన్ను ఆహ్వానించింది. జెలెన్స్కీ వస్తే పూర్తి భద్రత కల్పిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అయితే ప్రతిరోజూ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో చర్చలపై ఉక్రెయిన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంకా రష్యా డ్రోన్లలో స్టార్లింక్ ఉపగ్రహ సేవలు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: