అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వాణిజ్య విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టు కోలుకోలేని దెబ్బ తీసింది. ఇతర దేశాల వస్తువులపై ఏకపక్షంగా ‘ప్రతీకార సుంకాలు’ (Reciprocal Tariffs) విధించే అధికారం అధ్యక్షుడికి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గత ఏడాది ఏప్రిల్ 1న ‘లిబరేషన్ డే’ పేరుతో ట్రంప్ ప్రారంభించిన ఈ వాణిజ్య యుద్ధం, అమెరికాలోని వినియోగదారులు మరియు వ్యాపార సంస్థలపై ఆర్థిక భారాన్ని మోపిందని కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆరుగురు ఈ సుంకాలను వ్యతిరేకించగా, కేవలం ముగ్గురు మాత్రమే సమర్థించారు. 1977 అత్యవసర అధికారాల చట్టాన్ని (IEEPA) ఈ సుంకాల విధింపునకు వాడుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తన తీర్పులో కుండబద్ధలు కొట్టారు.

ఈ తీర్పుతో ట్రంప్ యంత్రాంగానికి మరో భారీ చిక్కు వచ్చి పడింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి, కంపెనీల నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని (Refund) సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా భారత్పై విధించిన 18 శాతం సుంకాలు, చైనాపై విధించిన 34 శాతం టారిఫ్ల వంటివి ఇప్పుడు వివాదంలో పడ్డాయి. తన ఆర్థిక విధానాల ద్వారా రాబోయే దశాబ్దంలో బడ్జెట్ను రెండు ట్రిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్కు, ఈ తీర్పు ఆర్థికంగా పెద్ద అడ్డంకిగా మారింది. అయితే, ఉక్కు మరియు అల్యూమినియంపై ఇతర చట్టాల ద్వారా విధించిన సుంకాలను ఈ తీర్పు ప్రభావితం చేయదు. కోర్టు తీర్పు నేపథ్యంలో, తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు వేలాది అంతర్జాతీయ కంపెనీలు న్యాయపోరాటానికి సిద్ధమవుతుండటంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com