ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) మధ్య యుద్దం ముదురుతోంది. ఇరాన్(Iran) పై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ప్రతీకార దాడులతో రోజురోజుకీ తీవ్రమవుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. భారత్(India) కు మిత్రదేశాలైన ఇజ్రాయెల్-ఇరాన్ ఇలా యుద్ధంలోకి దిగడంతో కేంద్రానికి సైతం ఏం చేయాలో తెలియని పరిస్ధితి. దీంతో దౌత్య మార్గాల్లో, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాల్నీ కోరింది. అదే సమయంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ముఖ్యంగా ఇరాన్ లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులు యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా ఉండాల్సిందిగా అక్కడి భారత ఎంబసీ పలు విజ్ఞప్తులు చేస్తున్నా పరిస్ధితులు పూర్తిగా విషమిస్తే ఏం చేయాలన్న దానిపై ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారతీయ విద్యార్ధులు సురక్షితంగా భూసరిహద్దులు దాటేలా అనుమతించాలని ఇరాన్ ను కేంద్రం కోరింది. దీనికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది.

ఇరాన్ లో 1500 మందికి పైగా మన విద్యార్దులు
ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో భారతీయ విద్యార్ధుల్ని వాయు మార్గంలో స్వదేశానికి తీసుకురావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భూసరిహద్దుల్ని తెరిచి వారిని క్షేమంగా తమ దేశం దాటేలా చూడాలని భారత్ కోరుతోంది. దీనికి ఇరాన్ అంగీకరించడంతో ఇవాళ్టి నుంచి సరిహద్దుల గుండా భారతీయ విద్యార్ధుల్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా బయటికి అనుమతించబోతున్నారు. ఇరాన్ కు భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.
ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు
ప్రస్తుత పరిస్థితి, దేశంలోని విమానాశ్రయాల మూసివేత, అలాగే అనేక రాజకీయ మిషన్లు తమ దౌత్యవేత్తలను, జాతీయులను విదేశాలకు బదిలీ చేయమని భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా, అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఇందుకోసం సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు, పాస్పోర్ట్ నంబర్లు, వాహన వివరాలను జనరల్ ప్రోటోకాల్ విభాగానికి ఇవ్వాలని భారత్ ను కోరారు.
దౌత్యవేత్తలతో పాటు ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రయాణ సమయం, ఆ వ్యక్తి దేశం నుండి నిష్క్రమించడానికి కావలసిన సరిహద్దు వివరాలు కూడా కోరారు. టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు, టెలిగ్రామ్ లింక్ ద్వారా నిరంతరం విద్యార్థులతో సంప్రదింపులో ఉంది. ఇరాన్లోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. తరగతులు నిలిపివేయబడ్డాయి. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉండటంతో, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కష్టంగా మారాయి. అలాగే భారతీయ పౌరుల కోసం రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లను ఇచ్చింది
Read Also: America:ఫేక్ గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ఫోకస్