సోమవారం కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇవాళ వాటికన్ సిటీలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్ తో పాటు పలు దేశాల అధినేతలు తరలివచ్చారు. వాటికన్ సిటిలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో పోప్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం కోసం దాదాపు 2 లక్షల మంది అభిమానులు, నేతలు, క్యాథలిక్కులు అక్కడ గుమికూడారు. లాంఛనాల తర్వాత పోప్ పార్ధివ దేహాన్ని సెయింట్ మేరీ మేజర్ లో ఖననం చేయనున్నారు.

భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పోప్ అంత్యక్రియల కోసం భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, జార్జి కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోషువా డిసౌజా తరలివెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా, మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ యూనుస్, సౌదీ యువరాజు, బ్రెజిల్ అధ్యక్షుడు, అర్జెంటీనా అధ్యక్షుడు, న్యూజిలాండ్ ప్రధాని సహా పలు దేశాధినేతలు, ప్రపంచ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పోప్ పార్ధివదేహాన్ని ర్యాలీగా తరలిస్తారు
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నుంచి అంత్యక్రియలు జరిగే స్థలం వరకూ నాలుగు కిలోమీటర్ల పాటు పోప్ పార్ధివదేహాన్ని ర్యాలీగా తీసుకెళ్తారు. ఆ సమయంలో స్థానిక ప్రజలు రోడ్లపై ఇరువైపులా నిలబడి నివాళులు అర్పిస్తారు. అనంతరం పోప్ చివరి కోరిక ప్రకారం అంత్యక్రియలు జరిగే స్థలమైన సెయింట్ మేరీ మేజర్ లోని ఓ చిన్న పెట్టెలో మృతదేహం ఖననం చేస్తారు. సోమవారం పోప్ చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు ఇప్పటివరకూ 2.5 లక్షల మంది తరలివచ్చి నివాళులు అర్పించారు.
Read Also: DGCA : పాక్ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ