ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన వేళ భారత్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి అమెరికా( Iraj Elahi America)ను సుతిమెత్తగా హెచ్చరించారు. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు చేసిందని చెప్పారు. ఇలా ప్రపంచంలోని ఏ దేశమూ యూఎస్ సైనిక స్థావరాలపై దాడి చేసే ధైర్యం చేయలేదని, కానీ తాము చేశామని పేర్కొన్నారు. అమెరికా(America) ఇంకోసారి ఇరాన్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, దానిపై ప్రతిదాడి చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఇరాన్ రాయబారి ఎలాహి, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల్లో అమెరికా ప్రవేశం తాము ముందు ఊహించిందేనని అన్నారు. దానికి అనుగుణంగానే ఇరాన్ సంసిద్ధమైందని పేర్కొన్నారు.

ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి
అమెరికా శనివారం నాడు ఇరాన్లోని మూడు ప్రధానమైన అణుస్థావరాలపై బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేసింది. దీనితో ఖతార్, ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే చాలా క్షిపణులను అమెరికన్ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత, ఇజ్రాయెల్-ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని, దీనితో 12 రోజుల యుద్ధం నిలిచిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిని అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ కూడా ధ్రువీకరించాయి.
నెతన్యాహు మానవీయ చట్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు
ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును నమ్మలేమని ఎలాహి అన్నారు. అందుకే ఇజ్రాయెల్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడితే, దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ఇరాన్ సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.”బెంజిమన్ నెతన్యాహు నమ్మదగినవాడు కాదు. అతను ఇరాన్పై సైనిక దాడిని ప్రారంభించాడు. దేశంలోని నివాస ప్రాంతాలను, అంబులెన్స్లను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించాడు.
అణ్వాయుధాలు తయారు చేస్తోందంటూ
ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇది మధ్యప్రాచ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని ఆరోపిస్తూ, జూన్ 13న ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఈ దాడిని పలు దేశాలు ఖండించినప్పటకీ తన చర్యలను ఇజ్రాయెల్ సమర్థించుకుంది.
ఐరన్ డోమ్ విఫలమైంది!
ఐరోన్ డోమ్ సహా ఇజ్రాయెల్ వద్దనున్న ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలేవీ ఇరాన్ క్షిపణులను అడ్డుకోలేకపోయాయని ఎలాహి పేర్కొన్నారు. అందుకే తమ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంలోని లక్ష్యాలను ఛేదించగలిగాయని ఆయన చెప్పారు. ఇరాన్ యుద్ధాన్ని మరింత పొడిగించాలని కోరుకోవడం లేదు. కానీ బాహ్య శక్తులు జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఇలాహీ స్పష్టం చేశారు. “అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల మద్దతు లేకుండా ఇజ్రాయెల్ స్వయంగా ఏమీ చేయలేదు. ఇరాన్లోని ప్రస్తుత పాలకులను తొలగించాలనే అమెరికా దీర్ఘకాల ఆకాంక్ష ఇక ‘ఒక కల’గానే మిగిలిపోతుంది” అని ఎలాహి పేర్కొన్నారు.
Read Also: Ceasefire: ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ..3 వేలు తగ్గిన బంగారం ధర.. !