అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓక్లహామాలో పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. టెక్సాస్, ఓక్లహామా, లూసియానాలలో ఇప్పటికే ఏడు టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో టెక్సాస్లోని శాన్ పాట్రిసియో కౌంటీలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 20కిపైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

విద్యుత్, రవాణా వ్యవస్థపై ప్రభావం
పసిఫిక్ ప్రాంతం నుంచి రాబోతున్న పెను తుపాను కారణంగా నేడు భారీ వర్షాలు, హిమపాతం సంభవించనున్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో పలుచోట్ల రహదారులను మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా టెక్సాస్లోని దాదాపు 51 వేల ఇళ్లు, వర్జీనియాలో 27 వేలు, టెన్నెసీలో 17 వేల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దాదాపు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తుపానుతో భారీ వర్షాలు
ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని గురువారం ఆల్ఫ్రెడ్ తుపాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీని కారణంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేశారు. క్వీన్స్లాండ్ బ్రిస్బేన్ నగరంపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. న్యూ సౌత్వేల్స్ లో 4,500 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వరుసగా తుపానుల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. అధికారుల సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని మధ్య, దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువగా సంభవిస్తాయి. వాటిని ముందస్తుగా గుర్తించడం కష్టం, కానీ వాతావరణ శాఖలు ప్రజలను ముందస్తుగా హెచ్చరిస్తాయి. ప్రజలు ఈ హెచ్చరికలను గమనించి, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం అత్యంత ముఖ్యము.