హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో నేడు హైడ్రా అధికారులు కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవనంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా 6 అంతస్తుల భవనం నిర్మించినట్లు సమాచారం అందింది.
స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. భవనానికి అవసరమైన అనుమతులు లేకపోవడంతో కూల్చివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఆదేశాలు ఇచ్చి, సోమవారం కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించారు. అధికారుల మాటను పట్టించుకోకుండా నిబంధనలను ఉల్లంఘించిన బిల్డర్పై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తోంది. హెచ్చరికల తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
కూల్చివేతల సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా మాదాపూర్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ చర్యతో భవనాల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించేవారికి బుద్ధి తెచ్చేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలకు ఇది చరిత్రాత్మక చర్యగా నిలుస్తుందని హైడ్రా అధికారులు ధీమా వ్యక్తం చేశారు.