తెలంగాణలో అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టులలో ఒకటైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి ప్రారంభమై గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, గంగాధార మీదుగా కరీంనగర్లోని కొత్తపల్లి వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ. 1400 కోట్లు ఖర్చు చేశారు. 2006లో ప్రతిపాదనలు మొదలైన ఈ ప్రాజెక్టుకు ప్రతి బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తూ వస్తున్నారు.కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం సిరిసిల్ల-సిద్దిపేట మధ్య గుర్రాలగొంది వరకు మాత్రమే ట్రాక్ పనులు పూర్తయ్యాయి. కరీంనగర్ జిల్లా(Karimnagar District)లో భూసేకరణ పూర్తయితేనే మిగతా పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ఇటీవల గంగాధర మండలంలో 51 ఎకరాల భూములు సేకరించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతంగా పూర్తయింది. ఇందుకోసం రూ. 58 కోట్లు వెచ్చిస్తున్నారు. వేములవాడ నుంచి బోడగుట్ట వరకు ట్రాక్ పనుల కోసం రూ. 224 కోట్లతో టెండర్లు పిలిచారు. వేసవిలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే 2027 చివరి నాటికి రైలు పట్టాలెక్కే అవకాశముంది.
నిర్మాణం
ఈ మార్గంలో 13 స్టేషన్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 7 పూర్తయ్యాయి. మొత్తం 160 వంతెనలకు గాను 98 వంతెనల నిర్మాణం పూర్తయింది. మిగతావి సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో నిర్మించాల్సి ఉంది. మనోహరాబాద్-గజ్వేల్ (32 కి.మీ), గజ్వేల్-దుద్దెడ (31 కి.మీ), దుద్దెడ-సిరిసిల్ల (49 కి.మీ) మేర ట్రాక్ నిర్మాణాలు పూర్తయ్యాయి. 49 అండర్ బ్రిడ్జిలకు 28 చోట్ల పనులు పూర్తయ్యాయి. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జి(Railway overbridge)లలో ఇతర జిల్లాల్లో ఐదు చోట్ల నిర్మాణం పూర్తయింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కలిపి 55 కి.మీ మేర ట్రాక్తో పాటు వంతెనలు నిర్మించాల్సి ఉంది. సిరిసిల్లలో దాదాపు 750 ఎకరాలు, కరీంనగర్లో 107 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది.

అభ్యంతరాలు
రెండు జిల్లాల పరిధిలో భూమి సేకరించి రైల్వే శాఖకు అప్పగించడం రెవెన్యూ శాఖకు సవాల్గా మారింది. గతంలో చేపట్టిన సర్వే ఆధారంగా సేకరించాల్సి ఉండగా పలుచోట్ల రైతులు పరిహారం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం లభించడం లేదని రైతులు వాదిస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు పనులు చేపడుతున్నారు. 2025-26 బడ్జెట్లో దాదాపు రూ. 200 కోట్ల వరకు కేంద్రం కేటాయించడంతో, పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 39 కి.మీ ట్రాక్ నిర్మాణానికి ఇప్పటి నుంచే చొరవ తీసుకుంటే 6-8 నెలల్లో పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణా అవసరాలు గణనీయంగా మెరుగుపడతాయి.
Read Also : Telangana: వాహనదారులు రూల్స్ పాటించకపోతే ఆటోమేటిక్ ఫైన్