బెంగళూరులోని హుళిమావు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సూట్కేసులో మహిళ మృతదేహం లభ్యమవడం సంచలనం రేపింది. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32) గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32) ను హత్య చేసి, ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి సూట్కేస్లో నింపాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా బెంగళూరులోని హులిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫోరెన్సిక్ బృందం
మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన వారు గౌరీ నివాసానికి చేరుకుని విచారణ చేపట్టారు.సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే హుళిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారు అక్కడికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఒక సూట్కేసు కనిపించిందని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సూట్కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం లభ్యమైందని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

నిందితుడు అరెస్ట్
పూణె పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసిందని హుళిమావు పోలీసులు తెలిపారు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేశ్ పూణెకు పారిపోయి అక్కడి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని బెంగళూరుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బృందం పూణెకు బయలుదేరింది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌరీ, రాకేశ్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారని, రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని బెంగళూరు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాకేశ్ ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తుండగా, గౌరీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
సంఘటనలు
గత కొంతకాలంగా రాజస్థాన్, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతున్నాయి.ప్రజల్లో మరింత ఆందోళన రేపుతోంది.బెంగళూరులో చోటుచేసుకున్న ఈ దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అనే అంశంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాకేశ్ బెంగళూరుకు చేరుకున్న తర్వాత విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది.