తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు కేంద్ర మద్దతు కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రధానికి లేఖ రాశారు. అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ప్రధానిని కలవాలన్న అభ్యర్థనను లేఖలో పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మద్దతు కోరారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. పార్లమెంట్ ఆమోదం పొందేలా కలిసి కట్టుగా కృషి చేసేందుకు అఖిలపక్షాలు సంసిద్దమయ్యాయి.తెలంగాణలో ఇప్పుడు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో , షెడ్యూల్ కులాలు 15 శాతం, షెడ్యూల్ తెగలు 7శాతం, మైనార్టీలు 4 శాతం, BCలకు 23 శాతం రిజర్వేషన్లు వున్నాయి. ఐతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగుణ నివేదిక ప్రకారం బీసీలు 56.36 శాతం . ఆ మేరకు రిజర్వేషన్ల పెంపుఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మద్దతు కోరనుంది అఖిలపక్షం,అపాయింట్మెంట్ కోరుతూ మోదీకి లేఖ వెళ్లింది. ఇక ప్రధాని కార్యాలయం నుంచి పిలుపే తరువాయి అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవనుంది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరు మార్పు
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు మరో లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును “పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరుతూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడంతో,పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ రెండు ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, తెలంగాణలో సామాజిక న్యాయ పరిరక్షణకు మరింత ఊరట లభించనుంది.