Maheshwar Reddy: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. ఆప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తిలా ఉంది. రాష్ట్ర దుస్థితికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్ అయితే.. రెండో ముద్దాయి కాంగ్రెస్. డీలిమిటేషన్ మీద రాహుల్గాంధీ వైఖరి చెప్పాలి. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.63 లక్షల కోట్లు అప్పులు చేసింది. అప్పులు చేయటంలో మాత్రమే తెలంగాణ రైజింగ్ కనిపిస్తోంది.

గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం
గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల విధ్వంసం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం నడవటం బాధాకరం. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు. కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. డీలిమిటేషన్తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చెప్పాలి. గత ప్రభుత్వం 11 శాతానికి తెచ్చిన వడ్డీలను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారో.. లేదో? చెప్పాలి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని ఏలేటి ప్రశ్నించారు.