అమెరికా అనేక దేశాలపై విధించిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోపక్క చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. అమెరికా వాణిజ్య భాగస్వాములైన 60 దేశాలపై సుంకాలు విధించిన కొన్ని గంటల తరువాత ట్రంప్ పాలసీలో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. సుంకాలపై సంప్రదింపులు కొనసాగుతున్నందున వాటిని మార్చడానికి బదులుగా వాణిజ్య భాగస్వాములందరిపైనా ఏకరీతిలో 10 శాతం టారిఫ్ రేటును నిర్ణయించారు. మరోపక్క చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన సుంకాలను అమెరికా 125 శాతానికి పెంచింది. అమెరికన్ వస్తువులపై చైనా విధించిన 84 శాతం సుంకానికి ప్రతిగా బీజింగ్ చర్యలు ప్రపంచ మార్కెట్లను గౌరవించడం లేదని ఆరోపిస్తూ అమెరికా ఈ చర్య తీసుకుంది. అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులన్నింటిపైనా ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత ఇది అమల్లోకి వచ్చింది. సుంకాల విధింపు అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభానికి కారణమైంది.

పుంజుకున్న అమెరికా షేర్లు
ట్రంప్ ప్రణాళిక ప్రకారం అమెరికా చేసుకునే అన్ని దిగుమతులపై 10 శాతం బేస్లైన్ సుంకం విధించారు. ఇది ఇప్పటికే అమల్లో ఉంది. కానీ తమను దోచుకుంటున్నారని ట్రంప్ అభివర్ణించిన దేశాలపైన అధిక సుంకాలు విధించారు. ఇందులో 27 సభ్యదేశాలైన యూరోపియన్ యూనియన్, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ 11 శాతం నుంచి 100 శాతానికి పైగా సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంది.
అమెరికా ప్రభుత్వ రుణాలపై వడ్డీరేటు 4.5శాతం
కిందటివారం ట్రంప్ టారిఫ్ల ప్రకటన తరువాత మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ట్రిలియన్ల కొద్దీ సంపద నష్టపోయాయి. చాలామంది అమెరికన్లు ధరలు పెరుగుతాయోమోనని భయపడుతున్నారు. కొంతమంది విశ్లేషకులు మాంద్యం ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. బుధవారంనాడు చైనా తప్ప మిగిలిన దేశాలపై అధిక సుంకాలను నిలుపుచేస్తూ ట్రంప్ ప్రకటన చేయడానికి ముందు అమెరికా ప్రభుత్వ రుణాలపై వడ్డీరేటు 4.5శాతం పెరిగింది. ఇది ఫిబ్రవరి నుంచి గరిష్ఠస్థాయి. ట్రంప్ ప్రకటన తరువాత యుఎస్ షేర్లు మధ్యాహ్న సమయానికి ఎస్ అండ్ పి 500 ఏడు శాతం పెరిగాయి. ఆ తర్వాత 9.5 శాతం లాభపడగా, డౌజోన్స్ 7.8 శాతం లాభపడింది. ట్రూత్ సోషల్ ఖాతాలో తమ పన్నులపై ప్రతీకారం తీర్చుకోని దేశాలకు టారిఫ్ లపై 90 రోజుల విరామానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. బీజింగ్ పై అదనపు సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు.
వీడని ప్రతిష్ఠంభన
“ఈ సుంకాల విధానాన్ని ప్రతిఘటించాలనుకున్న వారికి నేను 90 రోజులపాటు నిలిపివేస్తున్నాను. మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, మేం సుంకాలు రెట్టింపు చేస్తాం’ అని నేను వారికి చెప్పాను. చైనాతో చేసింది అదే,” అని శ్వేత సౌధం బయట మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. “ఇలా చేయడమే బావుంటుందని” తాను భావిస్తున్నానని కూడా అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ “ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటున్నారని” తాను భావిస్తున్నానని కూడా ట్రంప్ చెప్పారు.
ట్రంప్ గత వారం కొత్త సుంకాలను ప్రకటించినప్పుడు, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన పెరిగింది.
ప్రపంచమంతా ఏకం కావాలని చైనా విజ్ఞప్తి
అంతకుముందు అమెరికా చైనాపై 104 శాతం సుంకాన్ని ప్రకటించింది, ఆ తరువాత చైనా అమెరికాపై అదనంగా 50 శాతం సుంకం విధించింది. అంటే గతంలో ఉన్న 34 శాతానికి బదులుగా మొత్తం 84 శాతం సుంకాన్ని అమెరికాపై విధించింది. అమెరికా టారిఫ్ కు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని చైనా విజ్ఞప్తి చేసింది. అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి చైనా తన పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు.
READ ALSO: Trump: ట్రంప్ అనూహ్య నిర్ణయం..సుంకాలు 90 రోజులపాటు నిలిపివేత