హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన జరిగింది. ఐటీ హబ్ హైటెక్ సిటీ సమీపంలోని ప్రసిద్ధమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Durgam Cheruvu Cable Bridge) వద్ద ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నగరవాసుల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి పేరు సుష్మ (వయస్సు 27)గా పోలీసులు గుర్తించారు.

ఆఫీసుకు వెళ్లి తిరిగి రాని యువతి… కుటుంబంలో ఆందోళన
పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం, సుష్మ బుధవారం ఉదయం హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.
దుర్గం చెరువు సమీపంలో మృతదేహం వెలికితీత
బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. విచారణ చేపట్టగా, ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు.
ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా బయటపడలేదు. సుష్మ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.
ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు
ఈ విషాదకర ఘటన సుష్మ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతూ ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏమై ఉంటుందో అర్ధం కావడంలేదని వాపోతున్నారు.
Read also: School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన