ఇటీవల కార్యాలయాలు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా నోయిడాలోని 4 ప్రైవేట్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల ప్రాంగణంలో ఏపీ కనిపించనప్పటికీ ముందు జాగ్రత్తగా విద్యార్థులను భవనాల నుంచి తరలించారు. నోయిడా పోలీసులు, అగ్నిమాపక దళం, బాంబు స్క్వాడ్ బృందాలు స్టెప్ బై స్టెప్ స్కూల్, ది హెరిటేజ్ స్కూల్, జ్ఞానశ్రీ స్కూల్, మయూర్ స్కూల్ వద్దకు చేరుకుని పాఠశాలల ప్రాంగణాల్లో సెర్చ్ ఆపరేషన్స్ ను ప్రారంభించాయి.

ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా..ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని పాఠశాలలు తిరిగి తరగతులను కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సైబర్ బృందాలు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుల గురించి సమాచారం అందించిన వ్యక్తి గురించి దర్యాప్తు ప్రారంభించాయి. ఈ-మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని పోలీసులు కోరారు. మయూర్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉదయమే విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టారు. అవసరమయ్యే అన్ని ప్రోటోకాల్స్ పూర్తయిన తర్వాత అప్డేట్ అందిస్తామని మయూర్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇటీవల కాలంలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు, మెయిల్స్ వస్తుండడంతో అధికారులు పటిష్ట నిఘా పెట్టారు.