ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలిచింది.బుధవారం బెంగళూరుకు చేరుకున్న విజేత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.ఐపీఎల్(IPL) ఛాంపియన్లుగా నగరానికి తిరిగి వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల వేలాదిగా తరలివచ్చిన క్రికెట్ ప్రేమికులు “ఆర్సీబీ! ఆర్సీబీ!” అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు.ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. విక్టరీ పరేడ్ లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆర్సీబీ జెండా చేతిలో పట్టుకొని తన వాహనంలో ప్రయాణించడం విశేషం.
ఆటగాళ్లను చూడటానికి
ఆర్సీబీ జట్టు బస చేసిన హోటల్ వద్ద కూడా అభిమానుల సందడి నెలకొంది. “18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం, ఆర్సీబీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కల నిజమైనట్లుంది. ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి వచ్చాం” అంటూ పలువురు అభిమానులు తమ ఉద్వేగాన్ని పంచుకున్నారు.వారి మాటల్లో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కిన ఆనందం స్పష్టంగా కనిపించింది.యంగ్ కెప్టెన్ రజత్ పటిదార్(Rajat Patidar) నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజన్ ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. చివరి అడ్డంకిని విజయవంతంగా అధిగమించి, తొలిసారి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. మరోవైపు, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు కూడా గట్టి పోటీనిచ్చినప్పటికీ, రన్నరప్ తో సరిపెట్టుకుంది.
చాలా ప్రత్యేకమైనదని
ఈ చారిత్రాత్మక విజయంపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయం తన భార్య, నటి అనుష్క శర్మ(Anushka Sharma)కు కూడా చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. అనుష్క తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అందించిన మద్దతు గురించి కోహ్లీ ఎప్పుడూ ప్రశంసిస్తుంటారు. మరోవైపు, ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా స్పందిస్తూ, 18 ఏళ్ల క్రితం ఆటగాళ్ల వేలంలో యువకుడిగా ఉన్న విరాట్ కోహ్లీని తాను ఎంపిక చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. కోహ్లీ ఫ్రాంచైజీ పట్ల విధేయత చూపడం, జట్టు చిరకాల వాంఛ అయిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడం చూడటం గొప్ప అనుభూతినిచ్చిందని ఆయన తెలిపారు.ఈ విజయం ఆర్సీబీ ఫ్రాంచైజీకి, లక్షలాది మంది అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని, సంతృప్తిని అందించింది. బెంగళూరు నగరమంతటా పండుగ వాతావరణం నెలకొంది.
Read Also: RCB: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ