హైదరాబాద్: హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైనదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పని చేయాల్సినవసరం ఉందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం డీఆర్ఎఫ్లోకి ఔట్సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ మాట్లాడారు.
అంబర్పేట పోలీసు శిక్షణ మైదానంలో వారం రోజుల పాటు శిక్షణ

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్పందించాలన్న రంగనాథ్
అంబర్పేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సమాజంలోనూ.. ప్రభుత్వ పరంగా హైడ్రా ప్రధాన మైన భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ పని చేయాల్సినవసరం ఉందన్నారు. ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పడు ప్రజల ప్రాణాలతో పాటు.. ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదని.. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయన్నారు. మనమీద ఉన్న నమ్మకంతోనే ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తున్నదని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా మనకు చెప్పిందన్నారు. వీటన్నిటినీ మనం ఎంతో శ్రద్ధగా, బాధ్యతతో చేయాలన్నారు.
ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలకు ఎంతో పోటీ
పోలీసు పరీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా.. సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మిమ్ములను ఎంపిక చేశాం. ఇది ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు. ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలకు ఎంతో పోటీ ఉందని.. మీకు దొరికిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రతిభ కనబర్చాలన్నారు. భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు ప్రజలకు అండగా ఉంటూ.. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించే విధానాలపై వీరంతా అంబర్పేట పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు.
కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన ప్రదర్శించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ శిక్షణలో భాగంగా, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ ప్రమాణాలు, సహాయ చర్యల ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
అలాగే, నగరంలో పెరిగిపోతున్న విపత్తులను ఎదుర్కొనడంలో డీఆర్ఎఫ్ ఆధునిక పద్ధతులను అవలంబించాలని, ఇందులో భాగంగా కొత్త పరికరాలను వినియోగించడానికి వారికి తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇక, ఇటీవల నగరంలో వచ్చిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను ప్రస్తావించిన రంగనాథ్, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా నిర్వహించేందుకు డీఆర్ఎఫ్ బృందాలు మరింత ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని సూచించారు. శిక్షణ పొందుతున్న సిబ్బంది తమ బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకుని, అత్యుత్తమ సేవలందించేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.