విద్యార్థుల విద్యలో నిరంతరత, నాణ్యత, భాగస్వామ్యం పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త చర్యలు చేపడుతోంది. విద్యార్థుల హాజరుపై మరింత ఖచ్చితమైన నియంత్రణ ఉండాలని, విద్యాబ్యవస్థలో అసమర్ధతలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ఈ దిశగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు (Vijayarama Raju) కీలక ప్రకటన చేశారు. విజయవాడలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఎవరైనా విద్యార్థులు, వరుసగా మూడు రోజులకు మించి బడికి రాకపోతే, వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోవాలని సూచించారు. అలానే ఎవరైనా విద్యార్థులు ఒకవేళ ఐదు రోజుల కంటే ఎక్కువ పాఠశాలకు రాకపోతే, ఎంఈఓ, సీఆర్పీలు విద్యార్థుల ఇంటికి వెళ్లి, పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు.
క్రమం తప్పకుండా హాజరవ్వాలని ఆయన సూచించారు
విజయవాడలో విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు, అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో శనివారం విజయరామరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని ఆయన సూచించారు. టీచర్లు ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకల్లా హాజరు తీసుకోవాలని చెప్పారు. ఎంఈఓలు, సీఆర్పీలు, డీఈఓలు, ఏపీసీలు తరచుగా పాఠశాలలను పరిశీలించాలని ఆయన ఆదేశించారు.ఉపాధ్యాయులు సెలవు పెడితే, వెంటనే వేరే టీచర్ని నియమించాలని విజయరామరాజు గారు తెలిపారు. అలానే ముందు చెప్పకుండా లీవ్ తీసుకునే వారి లిస్ట్ తయారు చేయాలన్నారు. పదో తరగతి (10th class) లో తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టుల టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. వచ్చే సంవత్సరం నుండి తల్లికి వందనం పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

నిర్లక్ష్యం చేయకుండా
ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు ప్రైవేటు బడులు నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. ఎవరైనా ఉపాధ్యాయులు ప్రైవేటు బడుల్లో కనిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే ఐచ్ఛిక సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని, పాఠశాల మొత్తానికి కాదు అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు (Attendance of students) ను నిర్లక్ష్యం చేయకుండా, వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితుల నేపథ్యం తెలియజేసే విధంగా వ్యవస్థను మానవీయ కోణంలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ చర్యల ద్వారా డ్రాప్అవుట్ శాతం తగ్గుతుంది, విద్యార్హత పెరుగుతుంది, అని నిపుణులు భావిస్తున్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఇవి పటిష్టమైన అడుగులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Nara Lokesh: రేపు నెల్లూరులో పర్యటించనున్న నారా లోకేశ్