ప్రకాశం బ్యారేజి గేట్ల ఎత్తు పెంపు రూ. 8,740 కోట్లతో ప్రతిపాదనలు
Vijayawada: కృష్ణా నదికి గరిష్ట వరదను తట్టుకునే దిశలో కరకట్టలను నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. కృష్ణా నదికి చరిత్రలో ఎన్నడూ రానంత వరద గతేడాది ప్రకాశం బ్యారేజీ వద్ద పోటెత్తింది. ఈ అనుభవంతో అత్యధిక వరద వచ్చినా, తట్టుకునేలా నదీ వ్యవస్థను మెరుగుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) ని ఆధునీకరిస్తామని గతంలోనే ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. తదనుగుణంగా జలవనరుల శాఖ దీర్ఘకాలిక కార్యాచరణతో పాటు తాత్కాలిక పనులు చేపట్టింది. రూ.8470కోట్ల అంచనా వ్యయంతో పూర్తి స్థాయి ప్రతిపాదనలు రూపొందించి గత జనవరిలోనే నివేదించింది. ఇవి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. మరో వైపు ప్రస్తుత వరద కాలంలో అత్యధికవరద వచ్చినా తట్టుకునేందుకు చేయాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బ్యారేజీ వద్ద తుప్పు పట్టిన హాయిస్ట్ ప్లాట్ఫాం మరమ్మత్తులతో పాటు ఇతర పనులకు ప్రభుత్వం తాజాగా రూ.2 కోట్లు మంజూరు చేసింది. నది పొడవునా కరకట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రమాద నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

2009 వరద రికార్డును మించిన తాజా ప్రవాహం
కిందటి ఏడాది సెప్టెంబరు 2న ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎన్నడూ రానంత వరద పోటెత్తింది. నదిలో ఎగువ నుంచి వచ్చిన ప్రవాహానికి బుడమేరు వరద తోడై బ్యారేజీ వద్ద సముద్రాన్ని తలపించింది. మొత్తంగా 11.40 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. 2009 అక్టోబరు 5న 11.10 లక్షల క్యూసెక్కుల వరదే.. అప్పటి దాకా ఉన్న గరిష్ట రికార్డు. 1954లో కొత్త బ్యారేజీ కట్టాక ఇంతటి ప్రవాహం రెండు సందర్భాల్లోనే వచ్చింది. 1903లో పాత ఆనకట్ట ఉన్నప్పుడు 10.60 లక్షల క్యూసెక్కులు, 1952లో 8 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. కృష్ణా నది నైసర్గిక స్వరూపం, మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బ్యారేజీ వద్ద ఎప్పుడైనా 15.60 లక్షల క్యూసెక్కుల వదర రాగా, అదంతా ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి వచ్చిందే. సాగర్కు దిగువున పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్యనున్న వాగులు, వంకల్లోంచి అప్పట్లో పెద్దగా ప్రవాహం లేదు. ఈ స్థానిక వాగులు, వంకల పరీవాహకంలో ఇంత వరకు గరిష్టంగా 4,20,000 క్యూసెక్కుల వరద వచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే సాగర్కు ఎగువన కృష్ణాలో వచ్చే 11.10 లక్షలు, దిగువనున్న మూసీ, పాలేరు, మునేరు, బుడమేరు తదితర వాగుల ద్వారా తోడయ్యే 4.20 లక్షల క్యూసెక్కులు ఇతరత్రా కలిపి మొత్తంగా 15.60 లక్షల క్యూసెక్కుల గరిష్ట వదర ఎప్పుడైనా రావొచ్చన్నది జలవనరుల శాఖ అంచనా వేస్తోంది.
గరిష్ట వరదను తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీ డిజైన్
ప్రకాశం బ్యారేజీని 11.90 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించారు. గరిష్ట నీటిమట్టం 22.12 మీటర్లు (72.60 అడుగులు). అయితే, ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా 11.90 లక్షల క్యూసెక్కుల వరదనుకూడ నియంత్రించవచ్చన్నది జలవనరుల శాఖ అభిప్రాయం. అత్యధిక వరద తట్టుకోవాలంటే బ్యారేజీని ఆధునీకరించడంతో పాటు కరకట్టల సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. బ్యారేజీకి, పైన ఉన్న వంతెనకు మధ్య 9 అడుగుల మేర ఖాళీ ఉంది. గేట్లు ఎత్తే హాయిస్టింగ్ వ్యవస్థను మరో 2 మీటర్లు పైకి లేపాలన్నది ప్రణాళిక. ఇందుకు రూ.86 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తద్వారా బ్యారేజీపై ఒత్తిడి పడకుండా మరింత వరదను దిగువకు వదిలేయవచ్చు. బ్యారేజీతో పాటు 335 కి.మీ పొడవునా కుడి, ఎడమ కరకట్టల సామర్థ్యాన్ని 15 లక్షల క్యూసెక్కులు తగినట్లుగా పటిష్ట పరచాలి. వాటి ఎత్తు 8 అడుగులకు పెంచాలి. వెడల్పు కూడ పెంచడంతో పాటు పైన రహదారిని 7.5 మీటర్లకు విస్తరించాలి. ఈ పనులకు సుమారు రూ.8,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది.
Read also: TTD: రోజుకు 2.5లక్షల మందికి అన్నప్రసాదం