ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు విశాఖ కేజీహెచ్ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన గర్భస్థ శిశువు మృతి చెందిందన్న ఓ మహిళ ఆవేదనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తక్షణమే స్పందించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ఆమెను నేరుగా తన కార్యాలయానికే ఆహ్వానించారు.
Read Also: Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన

విమానాశ్రయంలో బాధితురాలి కన్నీటి గాథ
శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న పవన్ కళ్యాణ్ను విమానాశ్రయంలో శ్రీమతి పట్నాల ఉమాదేవి అనే మహిళ కలిశారు. గత ఏడాది డిసెంబర్లో తాను ఎదుర్కొన్న నరకయాతనను వివరిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. కాన్పు కోసం కేజీహెచ్లో చేరగా, వైద్య సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా మరియు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదు చేశారు.
కాన్పు గడువు ముగిసినా సిజేరియన్ చేయకుండా, సాధారణ ప్రసవం పేరుతో తనను చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. ప్రసవ సమయంలో ఒకరు తన గుండెలపై ఎక్కి కూర్చుని నరకం చూపించారని, ఆ అమానవీయ చర్య వల్లే తన బిడ్డ మృతి చెందిందని ఆమె ఆరోపించారు.

కేజీహెచ్ నిర్లక్ష్యంపై పవన్ సీరియస్
కుటుంబ సభ్యులు పదేపదే వేడుకున్నా వైద్యులు వినలేదని, పైగా వారిని తీవ్ర పదజాలంతో దూషించారని ఆమె వాపోయారు. బాధితురాలి గోడు విన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. ఘటనపై ప్రాథమిక సమాచారం అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలిని ఆమె కుటుంబంతో సహా వచ్చే సోమవారం అమరావతిలోని సచివాలయానికి తన కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు. గర్భస్థ శిశువు మృతికి సంబంధించి ప్రతి అంశాన్ని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
“నాకు జరిగిన అన్యాయం, మానసిక వేదన మరే మహిళకు రాకూడదు” అని ఉమాదేవి వేడుకోగా, పవన్ కళ్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో మాట్లాడి, బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చ మొదలైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: