ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే గ్రాడ్యుయేట్, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఇదే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.
ఈసీ షెడ్యూల్ విడుదల
ఏపీ శాసనమండలిలో త్వరలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాల పదవీకాలం ముగియనుంది. దీంతో ప్రస్తుతం ఆయా సీట్లలో ఎమ్మెల్సీలుగా ఉన్న జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు మాజీలు కాబోతున్నారు. వీరు ఖాళీ చేస్తున్న సీట్లకు కొత్తగా ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి కోసం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

మార్చి 10 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు
ఈ ఐదు సీట్లకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న విడుదల కానుంది. మార్చి 10 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అనంతరం 13న ఉపసంహరణ గడువు ఇచ్చారు. మార్చి 20న ఐదు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 24న గెలిచిన ఎమ్మెల్సీలు బాధ్యతలు చేపడతారు.
మరోవైపు ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లను కూటమి ఏకపక్షంగా గెల్చుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి 175 సీట్ల అసెంబ్లీలో 164 సీట్లతో కూడిన కూటమి ఐదు ఎమ్మెల్సీ సీట్లను గెల్చుకోవడం లాంఛనమే. దీంతో వైసీపీకి ఈసారి కూడా నిరాశ తప్పకపోవచ్చు.