ఇంట్లో జారిపడి చెయ్యి విరిగిందని ఆస్పత్రికి వెళితే ఏకంగా ప్రాణాలే పోయాయి. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరుకు చెందిన రేవతికి జనార్దన్తో వివాహమైంది. ఆయన చిప్పాడ దివీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారికి నాలుగేళ్లు, తొమ్మిది నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.అయితే జనార్దన్(Janardhan) ఉద్యోగ నిమిత్తం ఈ కుటుంబం మొత్తం విశాఖపట్నం తగరపువలస సమీపంలోని జీరుపేటలో నివాసం ఉంటున్నారు. ఆమె ఈనెల 6న బాత్రూంలో కాలు జారి పడిపోయారు. ఆమె కుడి చేయి విరగడంతో కుటుంబసభ్యులు సంగివలసలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సర్జరీ చేసేందుకు బీమా (ఇన్స్యూరెన్స్) అనుమతులు రావాలని డాక్టర్లు చెప్పారు. అనుమతులు వచ్చాక సర్జరీ చేస్తామని తెలిపారు.ఈనెల 8న సాయంత్రానికి అనుమతి రావడంతో ఈ 9వ తేదీ ఉదయం సర్జరీకి ఏర్పాట్లు చేశారు.

ఆందోళన
రేవతికి సర్జరీకి ముందు నొప్పి తెలియకుండా డాక్టర్లు మత్తు మందు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆ మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె భర్త జనార్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవతిని మెరుగైన వైద్యం కోసం ఆ ఆస్పత్రి నుంచినగరంలోని వేరే ఆసుపత్రిలో ఈనెల 10న చేర్పించారు. అయితే రేవతి పరిస్థితి రోజురోజుకీ విషమించడంతో బుధవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కేజీహెచ్(KGH)కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రేవతి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం జరిగే వరకూ పోస్ట్మార్టమ్(Postmortem)కు సహకరించేది లేదని మృతురాలి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.వారంతా ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.వారు మాత్రం ఆందోళన విరమించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Andhra Pradesh: ఆంధ్రాలో పేదలకు ఇళ్ల స్థలాలు