ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను తీసుకురావాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంకల్పానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని 44,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, ఉపాధ్యాయులు మరింత ఉత్తేజంతో బోధన చేపట్టే అవకాశముంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, మెరుగైన ఫలితాల సాధనకు ఇది తోడ్పడనుంది.
తల్లికి వందనం
సూపర్-6 హామీల్లో భాగంగా 2025-26 విద్యాసంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద 1 నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఉచిత పాఠ్యసామగ్రి
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద రాష్ట్రంలోని 35.69 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు, బూట్లు, పుస్తకాలు అందజేయనున్నారు. అదేవిధంగా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన సన్న బియ్యంతో ఉత్తమ భోజనం అందించనున్నారు.గత ఏడాది (2024-25) జగన్ ప్రభుత్వం రూ. 29,909 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రూ. 31,805 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత ఫలితాల కోసం దృఢంగా రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునాతన టెక్నాలజీని విద్యావ్యవస్థలో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది.
ఇన్నోవేషన్
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఏపీ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇది స్టార్టప్లకు మార్గదర్శకంగా నిలిచి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహాయపడుతుంది. రాష్ట్రంలోని ఐదు జోనల్ కేంద్రాలను ఈ హబ్తో అనుసంధానం చేసి, సాంకేతికతలో నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు.ఏపీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రపంచంలోని టాప్-100 విశ్వవిద్యాలయాల్లో స్థానం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మల్టీ-డిసిప్లినరీ ఎడ్యుకేషన్, పరిశోధన, పాలిటెక్నిక్లో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టి, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ క్రమంలో ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు రూ. 1,228 కోట్లు కేటాయించారు.