తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక పాత్ర పోషించబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.టీడీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం కాలేదని, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించబడిందని ఆయన పునరుద్ఘాటించారు.
తెలుగుదేశం పార్టీ
ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఈ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ మొదలైంది.చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలలో తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు ‘తెలుగు జాతి అభివృద్ధి’ అనే నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు. ‘తెలుగుదేశం పార్టీ పెట్టేందే తెలంగాణలో’ అని ఆయన పేర్కొనడం, ఆ పార్టీకి తెలంగాణతో ఉన్న చారిత్రక బంధాన్ని తెలియజేస్తుంది.
రాష్ట్రాలలో విస్తరణ
రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అండమాన్ (Andaman) వంటి చిన్న ప్రాంతాలలో కూడా తమ పార్టీ మున్సిపల్ చైర్మన్ను గెలిపించిందని, ఇది ఇతర రాష్ట్రాలలో విస్తరణకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు ఉదాహరించారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటివరకు లేదని, కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని తెలిపారు.

రాష్ట్ర రాజకీయాల్లో
2041 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉండాలనేదే తన ధ్యేయమని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండటం కూడా ముఖ్యమని ఆయన పరోక్షంగా సూచించారు.తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందన్న చంద్రబాబు నాయుడు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో రాజకీయ వాతావరణం మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగడం పలు విధాలుగా ప్రభావం చూపవచ్చు.
ప్రభావితం
టీడీపీ పోటీ చేయడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల ఓట్ షేర్ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ పట్టును బలంగా ఉంచుకోవాలని చూస్తున్నాయి. టీడీపీ పునరాగమనం ఈ రెండు పార్టీలకు కొత్త సవాలును విసురుతుంది. ఇదివరకు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది.