ఆంధ్రప్రదేశ్లో తొలి బర్డ్ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూ వల్ల మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎమ్ఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) నిర్ధారించింది.మార్చి 16న బాలిక మరణించగా,కొన్ని పరీక్షల తర్వాత ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్రంలో బర్డ్ఫ్లూతో మరణించిన మొదటి కేసు ఇదేకాగా,ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పచ్చి కోడి మాంసం తినడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
తొలి మరణం
రెండేళ్ల చిన్నారి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. చిన్నారి ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితి ఎదురైంది. పాపను మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు ఆక్సిజన్ పెట్టి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి స్వాబ్ నమూనాలు సేకరించారు. ఎయిమ్స్లోని వీఆర్డీఎల్లో పరీక్షించగా ఇన్ఫ్లుయెంజా ఎ పాజిటివ్గా తేలింది. అనంతరం మార్చి 15న మరోసారి శాంపిల్ను స్వీకరించి ఢిల్లీలో పరీక్షించారు. మార్చి 16న పాప చనిపోగా, ఐసీఎంఆర్ అప్రమత్తమైంది. మార్చి 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్ఐవీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరస్లపై పరిశోధనలు చేసే సంస్థ)కి పంపించగా,అక్కడ హెచ్5ఎన్1 వైరస్గా తేల్చారు.వైద్యారోగ్య శాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాలిక పెంపుడు కుక్కలు, వీధి కుక్కలతో ఆడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాపకు ఫిబ్రవరి 28న జ్వరం వచ్చిందని అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు చిన్నారి తల్లి తెలిపారు. కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇస్తే తిందని,ఆ తర్వాతే జబ్బు పడింది అన్నారు. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామని ఉడికించిన మాంసం తిన్న తమకెవరికీ ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు.
బర్డ్ఫ్లూ
పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. బాధిత కుటుంబం ఇంటికి కిలోమీటరు దూరంలో మాంసం దుకాణం ఉందని గుర్తించారు. చిన్నారి ఇంటి దగ్గర వైద్య ఆరోగ్యశాఖ సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్న వారు ఎవరూ లేరని తేల్చింది. ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక అధికారి నరసరావుపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను, స్థానికులను ప్రశ్నించారు.

వ్యక్తిగత రక్షణ
మాంసం, గుడ్లు పూర్తిగా ఉడికించుకుని తినాలి.చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. చికెన్ మార్కెట్లు, కోళ్ల ఫారాలను ఎక్కువగా సందర్శించవద్దు. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.బర్డ్ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు , మాస్కులు ధరించాలి.జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
లక్షణాలు
జ్వరంతోపాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యుల ను సంప్రదించాలి. కొవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవాలి. కాగా, బాగా ఉడికించిన చికెన్ తో సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు కావటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.