కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఆకాశంలో నిశ్శబ్దం ఆవరించింది. ఏప్రిల్ నెలలో ఒకరోజు ఆ ఎయిర్పోర్టులో కొన్నిగంటల పాటు విమానాల రాకపోకలు ఆగిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడమో, లేదా సాంకేతిక కారణాల వల్లో విమానాశ్రయం మూతపడలేదు, ఎయిర్పోర్టులోని రన్వే మీదుగా పద్మనాభస్వామి ఊరేగింపు వెళ్లడం కోసం ఈ ఏర్పాట్లు చేశారు. చెక్కరథాలపై, అలంకరించిన ఉత్సవమూర్తులను ఉంచి, రెండు కిలోమీటర్ల రన్వేపై ఊరేగింపుగా తీసుకెళ్తారు భక్తులు.

సంప్రదాయం కోసం రన్వేను మూసేస్తారు
ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయం కోసం రన్వేను కొద్దిగంటల పాటు మూసేస్తారు.
ఈ విమానాశ్రయంలో మామూలు రోజుల్లో 90 వరకూ విమానాల రాకపోకలు (ల్యాండింగ్స్, టేకాఫ్స్) జరుగుతాయి. హిందూ ఉత్సవాల్లో సాధారణంగా కనిపించే ఏనుగులు కూడా రన్వేపై సాగే ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. కోట్ల రూపాయల సంపదకు నిలయమైన శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఏటా నిర్వహించే పెయింకుని ఉత్సవంలో భాగంగా, ఏప్రిల్ 11న ఈ ఊరేగింపు నిర్వహించారు.
ట్రావెన్కోర్ సంస్థానాధీశుల ఆధ్వర్యంలో..
పది రోజుల పాటు జరిగే పెయింకుని ఉత్సవాల చివరి రోజున ఈ ఊరేగింపు జరుగుతుంది. ఆలయం వద్ద ప్రారంభమైన ఊరేగింపు విమానాశ్రయం రన్వే మీదుగా శంఘుముఘం బీచ్ వరకూ 6 కిలోమీటర్ల దూరం సాగుతుంది. బీచ్లో ఉత్సవమూర్తులకు అర్చకులు స్నానం చేయిస్తారు. అనంతరం, వచ్చిన దారిలోనే, రన్వే మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుతుంది. 1932లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించిన ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన రాజకుటుంబ పెద్ద ఈ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తారు.

పద్మనాభస్వామి ఆలయంలో జరిగే అల్పాషి పండుగ సమయంలోనూ తిరువనంతపురం విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు కార్యకలాపాలు నిలిపేస్తారు. ఈ పండుగ ఏటా అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల కోసం మూతపడే ప్రపంచంలోని అతికొద్ది విమానాశ్రయాల్లో తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి.
Read Also: Pareeksha :మూల్యాంకనంలో లోపాలు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం