తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్షా ప్రకటించారు. పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేశారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయిస్తామమని చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమన్నారు.దీంతో అన్నాడీఎంకే అధికారికంగా ఎన్ డిఏ కూటమిలోకి జాయిన్ అయినట్లయింది. ఈ రెండు పార్టీలు జట్టు కట్టడంతో తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే తమిళనాడు బీజేపీ చీఫ్గా నాగేంద్రన్ను ఖరారు చేసింది హైకమాండ్. గతంలో అన్నాడీఎంకేలో సుదీర్ఘకాలం పనిచేశారు నాగేంద్రన్.
అన్నామలై
తమిళనాడు బీజేపీ అధ్యక్ష మార్పుపై అమిత్షా ట్వీట్ చేశారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలైనట్లు చెప్పారు. మరోవైపు పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీకి ప్రశంసనీయ సేవలందించారని పేర్కొన్నారు. మోదీ విధానాలు ప్రజలకు చేరవేయడంలో ఆయన సఫలమయినట్లు రాసుకొచ్చారు. జాతీయ స్థాయిలో అన్నామలై నైపుణ్యాలు ఉపయోగించుకుంటామని వెల్లడించారు. అన్నామలై సహకారం మరవలేనిదన్నారు.
అనుచిత వ్యాఖ్యలు
ఢిల్లీలో అమిత్షాతో అన్నాడీఎంకే నేత పళనిస్వామి భేటీ తరువాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. బీజేపీకి అన్నాడీఎంకే దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అయితే పళనిస్వామి, అన్నామలై ఇద్దరు కూడా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే దీంతో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అన్నామలై స్థానంలొ కొత్త నేతను నియమించాలన్న ఆలోచన బీజేపీ హైకమాండ్కు వచ్చింది. ఇద్దరు కూడా కొంగు నాడు ప్రాంతంలో పట్టున్న నేతలే,అన్నామలై తీరుతోనే 2023లో ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే దూరమయ్యింది. దివంగత మాజీ సీఎం జయలలితపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో భారీ ఆందోళన చేపట్టారు అన్నాడీఎంకే కార్యకర్తలు. అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తొలగిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో అన్నాడీఎంకే విడిపోయిన తర్వాత బీజేపీ పరిస్ధితి రాష్ట్రంలో తీసికట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవడం పార్టీకి కత్తిమీద సాముగా మారుతోంది. గెలుపు సంగతి అటుంచి ఉనికి చాటుకుంటే చాలని కాషాయ శిబిరం భావిస్తోంది.
Read Also: Akshay Kumar: జయా బచ్చన్ విమర్శలపై స్పందించిన అక్షయ్ కుమార్