ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్(Pakistan)కు చేరవేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Youtuber Jyoti Malhotra) కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వినకొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా, ఆమె బంగాల్ రాజధాని కోల్కతా9Kolkatha)లోని ప్రధాన రక్షణ స్థావరాలను, జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు కోల్కతా పోలీస్ ప్రత్యేక టాస్క్ఫోర్స్, వివిధ జిల్లాలో పోలీసులు బంగాల్(Bengal)లో జ్యోతి(Jyothi) అడుగుజాడల గురించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బంగాల్లో ఉన్నప్పుడు జ్యోతి తిరిగిన ప్రదేశాల గురించి కోల్కతా పోలీసులకు హరియాణా పోలీసులు సమాచారం అందించారు.

పలు జిల్లాలను సందర్శించినట్లు సమచారం
జ్యోతి మల్హోత్రా బంగాల్కు వచ్చి పలు జిల్లాలను సందర్శించినట్లు తమకు సమచారం ఉందని ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి తెలిపారు. ఇలాంటివి జరిగినప్పుడల్లా ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ఎందుకు జనసాంద్రత గల ప్రాంతాల వీడియోలు తీసింది?
జ్యోతి తన పర్యటనలో భాగంగా కోల్కతాలోని వివిధ జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ యూట్యూబర్ సీల్దా స్టేషన్ నుంచి రైలు ప్రయాణం వీడియోను కూడా తీసింది. అంతేకాకుండా, ఉత్తర24 పరగణాల జిల్లా బరాక్పుర్లోని ఒక ప్రసిద్ధ బిర్యానీ అవుట్లెట్ను సందర్శించి అక్కడ వీడియోలను చిత్రీకరించింది.
సిలిగుడిలోని ఒక హోటల్లో బస
హుగ్లీ జిల్లాలోని షియోరాఫులిలో జ్యోతి మల్హోత్రా ఓ వివాహ వేడుకకు హజరైనట్లు STF అధికారులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంతో ఆమెకు ఉన్న సంబంధం, ఆమెను ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. జ్యోతి కొన్ని నెలల క్రితం సిలిగుడిని సందర్శించిందని పోలీసులకు తెలిసింది. కాగా, భూటాన్కు వెళ్లడానికి దిల్లీ నుంచి విమానంలో బాగ్డోగ్రాకు చేరుకున్నానని, సిలిగుడిలోని ఒక హోటల్లో బస చేశానని జ్యోతి తన యూట్యూబ్ వ్లాగ్లో పేర్కొంది.
రక్షణ స్థావరాల్లో వీడియోలు
అయితే, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, జ్యోతి తిరిగిన కోల్కతా, బరాక్పుర్, సిలిగుడిలో ప్రధాన రక్షణ స్థావరాలు ఉన్నాయి. కోల్కతాలో ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. బరాక్పుర్లో అనేక ప్రాంతాలు రాష్ట్ర పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడే భారత వైమానిక దళం పాత స్టేషన్ కూడా ఉంది. బాగ్డోగ్రా, హసిమారా రెండింటిలోనూ వైమానిక దళ స్టేషన్లు ఉన్నాయి. అలా సిలిగుడి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. మూడు మౌంటేన్ డివిజన్స్ కలిగి ఉన్న 33 కార్ప్స్ ప్రధాన కార్యాలయం సిలిగుడికి దగ్గరగా ఉన్న సుక్నాలో ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారం, యూట్యూబర్ జ్యోతి కొన్ని నెలల క్రితం మరో మహిళా యూట్యూబర్తో కలిసి పూరీలోని జగన్నాథ్ ధామ్, కోణార్క్ సూర్య దేవాలయం సహా అనేక దేవాలయాల వీడియోలను చిత్రీకరించింది.
3నెలల ముందు పహల్గాంలో వీడియోలు!
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గతవారం జ్యోతిని హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటికొచ్చాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె దిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు.
Read Also: Supreme Court: సైనికులపై వ్యాఖ్యలతో తీవ్ర వివాదం – విజయ్ షాపై సుప్రీం సీరియస్