హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్స్టాండ్కు ఉన్న అజారుద్దీన్ పేరును తొలిగించవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశాలు ఇస్తూ, తదుపరి విచారణ వాయిదా వేసింది. స్టేడియంలోని నార్త్ స్టాండ్కున్న అజారుద్దీన్ పేరును తొలిగించాలని హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ వంగ ఈశ్వరయ్య ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ తెలంగాణ హై కోర్ట్ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
అసలేం జరిగిదంటే ?
హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో అజారుద్దీన్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు తన పేరు పెట్టుకున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని అజారుద్దీన్ ఏకపక్షంగా తీసుకున్నాడని లార్డ్స్ క్రికెట్ క్లబ్ హెచ్సీఏ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అంబుడ్సమన్ జస్టిస్ ఈశ్వరయ్య హెచ్సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ఆదేశించారు. టికెట్లపై కూడా అజారుద్దీన్ స్టాండ్ అనే పేరు ఉండొద్దని తేల్చి చెప్పారు.ఈ తీర్పును సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను భారత జట్టుకు ఆడానని, సారథ్యం కూడా వహించానని తెలిపారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని తన వాదనను వినిపించారు. దాంతో హై కోర్ట్ అంబుడ్స్మన్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఎఫ్ఐఆర్
అజారుద్దీన్ హయాంలో హెచ్సీఏలో భారీ మొత్తంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది. క్రికెట్ బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ ఇక్విప్మెంట్ కొనుగోలు వ్యవహారంలో అజారుద్దీన్ ఆధ్వర్యంలోని హెచ్సీఏ పాలకవర్గ సభ్యులు చేసిన భారీ అవినీతి బయట పడింది. గత హెచ్సీఏ ఆఫిస్ బేరర్స్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఈడీ గుర్తించింది.20 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. మార్కెట్ ధరకు మించి పలు కంపెనీలకు కాంట్రాక్ట్ కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని ఈడీ విచారణలో తేలింది. ఈ అవినీతి దందాలో హెచ్సీఏ మాజీ ఉపాధ్యక్షుడు, కోశాధికారి సురేందర్ అగర్వాల్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ ఓ ప్రకటనను విడుదల చేసింది.