Donald Trump : జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. పచ్చని మైదానాల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్న అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో ఏకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ మారణహోమం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపగా, ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ కిరాతక చర్యపై తీవ్ర ఖండన వ్యక్తమైంది. ఈ కిరాతక చర్యను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలుస్తామని అమెరికా స్పష్టం చేసింది.

మోడీకి, భారత ప్రజలకు తమ పూర్తి మద్దతు ప్రగాఢ సానుభూతి
ఈ దాడిని “తీవ్రంగా కలచివేసేది”గా అభివర్ణించిన ట్రంప్,తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా భారత్కు అండగా నిలుస్తుందన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తామంతా ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మోడీకి, భారత ప్రజలకు తమ పూర్తి మద్దతు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
విచక్షణారహితంగా కాల్పులు
కాగా, పహల్గామ్ సమీపంలోని ప్రసిద్ధ బైసరాన్ మైదానంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదుల బృందం పర్యాటకులు గుమికూడి ఉన్న చోటికి వచ్చి, కనీసం హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే తూటాలు దూసుకురావడంతో పర్యాటకులు నేలకొరిగారు. ఘటనా స్థలంలో మృతదేహాలు పడివున్న దృశ్యాలు, ప్రాణ భయంతో కేకలు పెడుతున్న మహిళలు, చిన్నపిల్లలు, వారిని కాపాడటానికి ప్రయత్నిస్తూ గాయాలపాలైన స్థానికుల ఆక్రందనలు అక్కడ నెలకొన్న భీభత్సాన్ని కళ్ళకు కట్టాయి.
Read Also: కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ