హైదరాబాద్ మహానగరంలో కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడా అంటే అవుననే అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. అంతేకాదు అప్పట్లో సైబరాబాద్లోనూ ఉగ్రదాడికి ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నినట్లు గుర్తించారు. 2008 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎన్ఐఏ అమెరికా నుంచి రప్పించి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఎల్ఈటీ తరఫున పని చేసిన హెడ్లీ
ఇదే కేసులో దర్యాప్తులో భాగంగా అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అదుపులో ఉన్న హెడ్లీని 2010లో ఎన్ఐఏ ఉన్నతాధికారులు విచారించగా నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను భారత్పై యుద్ధం ప్రకటించిన ఎల్ఈటీ తరఫున పని చేశానని హెడ్లీ విచారణలో అంగీకరించాడు. ఇలా హెడ్లీ చెప్పిన కీలక అంశాలతో ఎన్ఐఏ 106 పేజీల నివేదికను రూపొందించింది. దీని ఆధారంగానే ఇప్పుడు తహవ్వుర్ను ఎన్ఐఏ ప్రశ్నిస్తున్నారు. ఆ నివేదికలోని అంశాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.
హెడ్లీ చెప్పిన కీలక విషయాలు
“మేము నిర్వహించబోయే ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా నేను అనేక మార్లు భారత్ను సందర్శించా. లష్కరే తోయిబా ‘దౌరా ఏ ఆమ్’ పేరుతో నిర్వహించిన 21 రోజుల ప్రాథమిక ఉగ్ర శిక్షణకు హాజరయ్యా. ఆయుధాల వాడకానికి సంబంధించి ‘దౌరా ఏ ఖాస్’ పేరుతో మూడు నెలలపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణనూ పూర్తిచేశా. నన్ను పర్యవేక్షిస్తున్నవారు, సహచరులతో నిరంతరం రహస్యంగా ఎలా సంప్రదింపులు జరపాలో నిర్దేశించేందుకు ‘దౌరా ఎ రిబాత్’ పేరిట నిర్వహించిన మూడు వారాల శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత నన్ను ముజఫరాబాద్లో ‘ఐస్బాక్స్’ అని పిలుచుకునే సేఫ్ హౌస్కి తీసుకెళ్లారు.
దాడిలో హైదరాబాద్ కూడా ఉంది
భవిష్యత్తులో తాము భారతదేశంలో జరపబోయే దాడులకు సంబంధించిన వివరాలను ఎల్ఈటీకి చెందిన సాజిద్ మజీద్, అబు క్వహాఫా, ముజమ్మిల్లు వివరించారు.” అని ఎన్ఐఏ విచారణలో హెడ్లీ కీలక విషయాలు వెల్లడించాడు. వాటికి సంబంధించిన కొన్ని మ్యాపులు, ఫొటోలు కూడా చూపారని హెడ్లీ విచారణలో వెల్లడించాడు. అందులో రాజ్కోట్లోని చమురుశుద్ధి కర్మాగారం, సైబరాబాద్ మ్యాప్ ఉందని తెలిపాడు. ఆ రెండు చోట్లా దాడులకు ఎల్ఈటీ వ్యూహం పన్నినట్లు నాకు అర్థమైందన్నాడు. ఆ తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా ఎల్ఈటీ నన్ను భారత్కు పంపాలని అనుకుందని చెప్పాడు. ఈ సందర్భంగా నేను నివసించడానికి అనుకూలమైన నగరాలపై చర్చ జరిగింది. ఆ జాబితాలో కోల్కతా, దిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్పుర్లతోపాటు హైదరాబాద్ కూడా ఉంది’’ అని హెడ్లీ వెల్లడించినట్టు ఎన్ఐఏ నివేదికలో ఉంది.
పర్యాటకుడి ముసుగులో హెడ్లీ
ఆ తర్వాత పర్యాటకుడి ముసుగులో లష్కరే తోయిబా హెడ్లీని ముంబయి పంపించి, రెక్కీ నిర్వహించిన అనంతరం దాడులకు పాల్పడింది. తదుపరి హెడ్లీ.. డెన్మార్క్లో విధ్వంసానికి ప్రణాళిక రచిస్తున్నట్లు గుర్తించిన ఎఫ్బీఐ అతన్ని అరెస్టు చేసింది. అప్పుడే ముంబయి ఉగ్రదాడిలో అతని ప్రమేయం బయటపడింది.
Read Also: Ukraine : అమెరికాతో ఖనిజాల ఒప్పందం పై తొలి అడుగు : ఉక్రెయిన్